ప్రశాంత్ కిశోర్ బిగ్ స్టేట్ మెంట్- బీజేపీ జాతీయ అధ్యక్షుడి సీటులో..!!
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ స్వయంగా ప్రత్యక్ష ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. బీహార్ లోని ప్రతిష్టాత్మకమైన పాట్నా బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆయన పోటీ చేయబోతున్నారు. ఈ నిర్ణయాన్ని జన్ సూరాజ్ పార్టీ చీఫ్ మనోజ్ భారతి వెల్లడించారు. కొద్దిసేపటి కిందటే పాట్నాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రశాంత్ కిశోర్ తో కలిసి మాట్లాడారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ బాంకీపూర్ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆగస్టు 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. నితిన్ నబీన్ రాజీనామాతో బాంకీపూర్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ఇది బీజేపీకి కంచుకోట. ఇలాంటి స్థానంలో ప్రశాంత్ కిషోర్ ఎలా నెగ్గుకొస్తారనేది చర్చనీయాంశమైంది.

గత 40-45 ఏళ్లుగా బీజేపీకి పట్టం కడుతూ వస్తోంది..బాంకీపూర్ నియోజకవర్గం. తన పోరాటంతో ఈ బలమైన కోటను బద్దలు కొట్టడానికి సిద్ధమని ప్రశాంత్ కిశోర్ జూన్ లోనే సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ జన్ సూరాజ్ తనను అభ్యర్థిగా ఎంపిక చేస్తే రంగంలోకి దిగుతానని అప్పట్లో ప్రకటించారు. తాజాగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది జన్ సురాజ్ పార్టీ. ఆయన పోటీ చేయబోతోన్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ ఉప ఎన్నిక.. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని సరికొత్త ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు మొదటి అగ్నిపరీక్ష కాబోతోందని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. నాలుగు సంవత్సరాలుగా జన్ సురాజ్ తన జీవితంలో భాగం అయిందని, బీహార్లో మార్పు అనే ఆశయం నెరవేరే వరకు మరో లక్ష్యం తనకు లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల ఫలితాలు తమకు నిరాశకు గురి చేసినప్పటికీ.. మార్పు అనే ఆశయాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఈ ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని చెప్పారు.
బీజేపీ ఇంకా ఈ స్థానానికి అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున నితిన్ నబీన్ పోటీ చేశారు. ఆయనకు ఏకంగా 98,299 ఓట్లు పోల్ అయ్యాయి. ఆయన ప్రత్యర్థి, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారికి పడిన ఓట్లు 46,363 మాత్రమే. అటు జన్ సూరాజ్ పార్టీ అభ్యర్థి వందనా కుమారికి 7,717 ఓట్లు వచ్చాయి. నోటా'కు 1,464 ఓట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పంకజ్ కుమార్కు 790, స్వతంత్ర అభ్యర్థి రవి కుమార్కు 666 ఓట్లు పోల్ అయ్యాయి.. బాంకీపూర్ లో.
ఈ స్థానం నుంచి నితిన్ నవీన్ 2006లో తొలిసారిగా అసెంబ్లీ విజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత 2010, 2015, 2020, 2025 లలో వరుసగా బాంకీపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ రికార్డు సృష్టించారు. అటువంటి పటిష్టమైన స్థానాన్ని ఈసారి చేజిక్కించుకుని చరిత్రాత్మక మార్పు తీసుకువస్తామని జన్ సూరాజ్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకాలం వ్యూహకర్తగా మాత్రమే పని చేసిన ప్రశాంత్ కిశోర్ నేరుగా ఎన్నికల బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.












Click it and Unblock the Notifications