'ఆనంది' నన్ను పిలుస్తోంది, వెళ్తా: ఐసీయులో ప్రియుడు పలవరింత
ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ రెండు రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యాడు. ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఐసీయులో చికిత్స పొందుతున్న అతను.. ప్రత్యూష తనను పిలుస్తోందని పలవరిస్తున్నాడని తెలుస్తోంది.
రాహుల్ పరిస్థితి ఇప్పుడు బాగా లేదని, అతను నిత్యం ప్రత్యూషను కలవరిస్తున్నాడని, అతను ఇంకా ఐసీయూలోనే ఉన్నాడని రాహుల్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రత్యూష తనను పిలుస్తోందని అంటున్నాడని చెప్పారు.
రాహుల్ ఏం తినడం లేదని చెబుతున్నారు. రాహుల్ను చూసేందుకు ఐసీయూకు వెళ్లిన వారితో వింతగా ప్రవర్తిస్తున్నాడని చెబుతున్నారు. ప్రత్యూష తనను పిలుస్తోందని, వెళ్తానని అంటున్నాడని రాహుల్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు ఏమైపోతాడోననే ఆందోళన ఉందన్నాడు.

సాయపడ్డాను: ప్రత్యూష తల్లి
ప్రత్యూష ఆత్మహత్యపై ఆమె తల్లి స్పందించారు. ప్రత్యూష, ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ ఇద్దరు నిత్యం గొడవపడేవారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు సాయపడ్డానని ప్రత్యూష తల్లి తెలిపారు. ముంబై బంగూర్ నగర పోలీస్ స్టేషన్లో ఆమె వాంగ్మూలం ఇచ్చారు. అందులో పైవిధంగా పేర్కొన్నారు.
ప్రత్యూషకు, రాహుల్కు విభేదాలు వచ్చాక ఇద్దరు విడిపోయారని, గొడవలు పడటం మానుకొని భవిష్యత్తు పైన దృష్టి సారించాలని తాను వారికి సూచించానని చెప్పారు. ప్రత్యూష ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తనకు తెలియదన్నారు. కేసును సమగ్రంగా దర్యాఫ్తు జరపాలన్నారు.
మూర్ఖమైన పని: హేమమాలిని
ప్రత్యూష ఆత్మహత్య పైన బాలీవుడ్ అలనాటి నటి హేమమాలిని స్పందించారు. ఈ సంఘటన ఆమెను చికాకు పెట్టినట్లుగా ఉంది. ఆత్మహత్య సబబు కాదన్నారు. మూర్ఖమైన ఆత్మహత్యలని, వాటి వల్ల ఏమీ జరగదని, జీవితం దేవుడు ఇచ్చిన కానుక అని, అది జీవించేందుకు ఉంది కానీ మనకు నచ్చినప్పుడు ప్రాణాలు తీసుకోవడానకిి కాదని, ప్రాణాలు తీసుకునే హక్కు మనకు లేదని హేమమాలిని అన్నారు.
కష్యాలను ఎదుర్కొని ఎలా విజయం సాధించాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. అంతేగానీ ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలు తీసుకోవద్దన్నారు. ప్రపంచం పోరాడే వారిని కీర్తిస్తుందని, పరాజితులను కాదన్నారు. సెలబ్రిటీల ఆత్మహత్యలు ఆకలి గొన్న మీడియాకు ఆహారం లాంటివని, మరో సెన్షేషన్ వచ్చే వరకు దానిని ప్రసారం చేస్తాయని, ఆ తర్వాత మర్చిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications