మణిపూర్లో ముందస్తు ఎన్నికల హింస: బీజేపీ అభ్యర్థి సోదరుడి ఇంటిపై ఆగంతకుల కాల్పులు
మణిపూర్లో రానున్న ఎన్నికల నేపధ్యంలో ఇప్పటి నుండి వాతావరణం వేడెక్కుతుంది. మణిపూర్ లోని ఆండ్రో అసెంబ్లీ నియోజకవర్గంలో హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 11.20 గంటలకు యైరిపోక్ యంబెమ్ మఖ లైకైలో రంజిత్ లౌరెంబమ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. ఇంట్లో పలుచోట్ల బుల్లెట్లు తగిలినా ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రంజిత్ లౌరెంబమ్ తమ్ముడు సంజోయ్ లౌరెంబమ్ ఆండ్రో నియోజకవర్గం నుండి బిజెపి టిక్కెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నారు.
మణిపూర్ ఎన్నికలపై బీజేపీ నజర్; 'గో టు విలేజ్ 2.0'ని ప్రారంభించిన జేపీ నడ్డా, మణిపూర్ సీఎం
ఆండ్రో నియోజకవర్గంలో కాల్పుల ఘటన .. ఉలిక్కిపడ్డ జనం
ఒక్కసారిగా కాల్పుల ఘటనతో ఆండ్రో నియోజకవర్గ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆదివారం ఉదయం ఆండ్రో పోలీస్ స్టేషన్లోని పోలీసు సిబ్బంది కాల్పులు జరిగిన స్థలాన్ని సందర్శించారు. ఇంటికి కొంచెం దూరంలో 10కి పైగా ఖాళీ కాట్రిడ్జ్లను సేకరించినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు ముందు తుపాకీ దాడులు జరిగిన లోయ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆండ్రో ఒకటి. కొన్ని వారాల క్రితం కాల్పులు జరపడంతో కొంతమంది గాయపడ్డారు. ఏకే-47 రైఫిల్స్ వంటి అధునాతన ఆయుధాలను కూడా ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఆండ్రో నియోజకవర్గంలో కాల్పులు సాధారణం.. ఇటీవల కూడా కాల్పుల ఘటన
ఆండ్రో నియోజకవర్గంలోని కొండ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఏకే-47 రైఫిల్ను, కొన్ని లైవ్ బుల్లెట్లను పాతిపెట్టారు. ప్లాస్టిక్ సంచిలోదాచి పాతిపెట్టిన తుపాకీ మరియు మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అధునాతన ఏకే 47 తుపాకీ యజమాని ఎవరో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో లైసెన్స్ పొందిన తుపాకీ యజమానులు తమ తుపాకులను సమీపంలోని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే హింస
భారత ఎన్నికల సంఘం ఇంకా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించలేదు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఎన్నికల ముందే మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో భయాందోళనకు కారణంగా మారుతుంది. ఇదిలా ఉంటే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 2022వ సంవత్సరం ప్రారంభంలో జరగనున్నాయి. ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.