బిడ్డ దక్కదనుకున్నారు.. కానీ!: ఉగ్రదాడిలో గాయపడ్డ ఆ మహిళకు..
జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లోని సంజ్వాన్ మిలటరీ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో రైఫిల్ మ్యాన్ నజీర్ అహ్మద్ భార్య కూడా తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆమె వెన్నుపూసలోకి తూటా దూసుకెళ్లింది.

బిడ్డపై ఆశలు వదులుకున్నారు..
గాయపడ్డ మహిళ ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భంతో ఉండటంతో బిడ్డపై అంతా ఆశలు వదులుకున్నారు. కానీ సరైన సమయంలో చికిత్స అందించడంతో.. ఓ పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. సత్వారీలోని మిలటరీ ఆసుపత్రిలో 2.5కిలోలు ఉన్న ఆడ శిశువుకు ఆమె జన్మనిచ్చింది.

తల్లీబిడ్డ క్షేమం
'తీవ్రంగా గాయపడ్డ గర్భిణీ మహిళను, ఆమె కడుపులోని బిడ్డను బ్రతికించడానికి ఆర్మీ డాక్టర్లు రాత్రంతా శ్రమించారు. సిజేయరిన్ ఆపరేషన్ ద్వారా శిశువుకు పురుడు పోశారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉంది.' అని ఆర్మీ లెఫ్ట్ కల్నల్ దేవెందర్ ఆనంద్ తెలిపారు.

అతని పరిస్థితి విషమం
ఇక ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన మరో 14ఏళ్ల బాలుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని దేవెందర్ ఆనంద్ చెప్పారు. ఉగ్రవాదుల దాడుల్లో ఐదుగురు సైనికులు, ఇద్దరు జూనియర్ కమిషన్ అధికారులు, ఒక సైనికుడి తండ్రి మరణించినట్టు ధ్రువీకరించారు.

11మందికి గాయాలు:
మరో 11మంది దాకా తీవ్ర గాయాలపాలయ్యారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఉగ్రవాదులకు-భారత ఆర్మీకి మధ్య సాగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.












Click it and Unblock the Notifications