పాక్ ధ్వంసం చేసిన చారిత్రక ఢాకా కాళీ మందిరాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్
ఢాకా: బంగ్లాదేశ్లో పునర్నిర్మించిన చారిత్రక శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని ఆ దేశ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ప్రారంభించారు. పాకిస్థాన్ సైన్యం 1971 యుద్ధం సమయంలో ఢాకాలో ఉన్న రమ్నా కాళీ ఆలయాన్ని ధ్వంసం చేసింది. అయితే దాన్ని మళ్లీ పునర్ నిర్మించారు. శుక్రవారం ఆలయాన్ని భారత రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్ మళ్లీ ప్రారంభించారు.
బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి కోవింద్.. చివరి రోజైన మూడో రోజు రాజధాని ఢాకాలోని ఈ చారిత్రక ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన సతీమణి సవితా కోవింద్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ.. భారత్-బంగ్లాదేశ్ ప్రజల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధానికి చిహ్నంగా ఈ ఆలయం నిలుస్తుందని అభివర్ణించారు. భారత్ సాయంతో ఈ ఆలయాన్ని పునర్ నిర్మించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ బలగాలు హిందూ ఆలయాలే లక్ష్యంగా దాడులు చేసింది. అనేక మంది హిందువులను, బెంగాలీలను హతమార్చింది. ఆ సమయంలోనే శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని కూడా పాక్ బలగాలు ధ్వంసం చేశాయి. ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో పాకిస్థానీ సైన్యం చేపట్టిన దాడుల్లో గుడిని పూర్తిగా ధ్వంసం చేసి, నిప్పంటించాయి. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భక్తులతోపాటు అక్కడ ఆశ్రయం పొందిన దాదాపు వెయ్యి మంది మృతి చెందారు.
కాగా, ప్రస్తుత ఈ ఆలయ పునర్ నిర్మాణానికి భారత్ చేయూతనందించింది. 2017లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ ఆలయాన్ని ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఇక్కడ రమ్నా ఆలయ పునర్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టారు. ముస్లిం మెజారిటీ బంగ్లాదేశ్లో 16.9 కోట్ల జనాభా ఉండగా, అందులో దాదాపు 10 శాతం హిందువులున్నారు. కాగా, 1971 లిబరేషన్ వార్లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్ లో విజయ్ దివస్ ను నిర్వహిస్తున్నారు.
స్వాతంత్ర్యం పొంది ఈ ఏడాదికి 50 ఏళ్లు కావడంతో దేశ వ్యాప్తంగా గోల్డెన్ జూబ్లీ వేడులకు చేసుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నుంచి భారత్కు ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే మూడు రోజులుగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బంగ్లాలో పర్యటిస్తున్నారు. చివరి రోజైన మూడో రోజు బంగ్లా రాజధాని ఢాకాలోని ఈ చారిత్రక ఆలయాన్ని ప్రారంభించారు.