బీజేపీ అలా చేసుంటే ద్రౌపది ముర్ముకే మా మద్దతుండేది, కానీ..: మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విషయంపై బీజేపీతో తమను ముందే సంప్రదించివుంటే తాము ఆమెకే తమ మద్దతు ఇచ్చేవాళ్లమని మమతా బెనర్జీ అన్నారు.
బీజేపీ తమతో చర్చించివుంటే ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్ముకే తమ మద్దతు ఇచ్చివుండేవాళ్లమని చెప్పారు. దీంతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక మరింత సులభంగా ఉండేదని అన్నారు. అయితే, ఇప్పుడు మాత్రం తాము విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాను బరిలో దింపిన విషయం తెలిసిందే. 2018లో యశ్వంత్ సిన్హా బీజేపీని వీడి.. మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీలో చేరారు.
కాగా, రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్నాయి. మూడు రోజుల తర్వాత అంటే జులై 21న ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. జులై 24న ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. రాజ్యాంగం ప్రకారం.. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం ముగియకముందే కొత్త రాష్ట్రపతి నియామకం జరగాలి.
776 మంది పార్లమెంటు సభ్యులు, 4,033 మంది శాసన సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. నామినేటెడ్ ఎంపీలు, శాసన మండలి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు.