సీజే రమణ సూచనపై జగన్, కేసీఆర్ మౌనం-అసాధ్యమనే సంకేతాలు-పెరుగుతున్న ఒత్తిడి
ఏపీ-తెలంగాణ మధ్య విభజన సందర్భంగా చేసిన తప్పిదాల కారణంగా తలెత్తిన జల వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. జల వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన సూచనపై ఇరువురు సీఎంలూ మౌనంగా ఉండిపోవడమే ఇందుకు కారణం. మరోవైపు కృష్ణా,గోదావరి బోర్డుల సమావేశం తర్వాత మధ్యవర్తిత్వం అసాధ్యమనేలా ఇద్దరూ సంకేతాలు ఇవ్వడం తాజా పరిస్ధితికి అద్దం పడుతోంది.
ఏపీ-తెలంగాణ వాటర్ వార్
ఏపీ-తెలంగాణ మధ్య సాగుతున్న వాటర్ వార్ ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలతో మొదలైన ఈ జల జగడం పర్యవసానంగా కృష్ణా, గోదావరి బోర్డులపై పెత్తనం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది. సీఎం జగన్ కోరిక మేరకు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసినా.. వాటిపైనా ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. దీంతో వాటర్ వార్ కు ముగింపు పలికేందుకు ఇరు రాష్ట్రాలూ సిద్ధంగా లేవని తేలిపోతోంది.
సీజే సూచనపై జగన్, కేసీఆర్ మౌనం
ఏపీ-తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాలకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోండని ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన సూచనను ఇరు రాష్ట్రాలు మన్నిస్తాయని భావించినా ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులేవీ పడటం లేదు. దీంతో జగన్, కేసీఆర్ ఇద్దరూ మధ్యవర్తిత్వ పరిష్కారంపై మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారానికి వెళితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ పరిష్కారంతో తమకు రాజకీయంగా నష్టం కూడా ఉండొచ్చనే అనుమానాలు జగన్, కేసీఆర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వీరిద్దరూ ఈ వ్యవహారాన్ని మరికొంతకాలం సాగదీసేందుకే మొగ్గు చూపుతున్నారు.
మధ్యవర్తిత్వాన్నికి పెరుగుతున్న ఒత్తిడి
ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించిన మధ్య వర్తిత్వ పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల్లో మద్దతు పెరుగుతోంది. జస్టిస్ రమణ సూచన మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగనా్, కేసీఆర్ గతంలోలాగనే కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందనే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఈ సూచనను పలు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. కోర్టుల ద్వారా పరిష్కారం కోరితే అంతిమంగా ఇరు రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టుకు కేసీఆర్, జగన్ తమ నిర్ణయం చెప్పాలని కోరుతున్నారు.
అసాధ్యమనే సంకేతాలు
ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవాలని సీజే రమణ సూచించడం, దానికి పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు పెరుగుతుండటంతో కేసీఆర్, జగన్ పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే అదే సమయంలో వీరిద్దరూ తాజాగా కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ సమావేశంలో వినిపించిన వాదనలు చూస్తే ఈ సమస్యకు మధ్యవర్తిత్వం ద్వారా కూడా పరిష్కారం కష్టమేననే సంకేతాలు ఇచ్చినట్లయింది. దీంతో మధ్యవర్తిత్వానికి ఇరు రాష్టాలూ మొగ్గు చూపకపోతే సుప్రీంకోర్టు సీజే.. మరో బెంచ్ కు ఈ కేసు బదిలీ చేసే న్యాయ పరిష్కారాన్ని సూచించే అవకాశముంది. దీనిపై తెలుగు రాష్ట్రాల స్పందన చూశాక సీజే రమణ ఓ నిర్ణయం తీసుకోనున్నారు.