స్టార్టప్ ఇండియా: వరాల వాన కురిపించిన మోడీ
న్యూఢిల్లీ: దేశంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి వాటిపై ప్రధాని నరేంద్ర మోడీ వరాలు కురిపించారు. వీటికి మూడేళ్లపాటు పన్ను విరామం ఉంటుందని ప్రకటించారు. రూ.10,000 కోట్లతో మూలనిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తొమ్మిది రకాల కార్మిక, పర్యావరణ చట్టాల పరంగా వేధింపులు లేని రీతిలో స్వీయ ధ్రువీకరణ సరిపోతుందని చెప్పారు.
స్టార్టప్లకు మొదటి మూడేళ్లపాటు తనిఖీలు ఉండబోవని భరోసా ఇచ్చారు. వీటికి తోడ్పడడం కోసం పేటెంట్ విధానాన్నీ సరళతరం చేస్తున్నామనీ, దీని నిమిత్తం వసూలు చేసే రుసుమును 80% మేర తగ్గిస్తున్నామనీ చెప్పారు. ఆదివారం నాడిక్కడ స్టార్టప్ ఇండియాపై 19 అంశాల కార్యాచరణను ప్రధాని ఆవిష్కరించారు.
తొలిసారిగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఉపాధి కల్పనకు, తద్వారా సంపద సృష్టికి దోహదపడే స్టార్టప్లను ప్రోత్సహించడానికి కార్యాచరణను వెల్లడించారు. ప్రభుత్వ సంబంధిత సేకరణ ఒప్పందాల్లోనూ స్టార్టప్లకు భాగస్వామ్యం కల్పించడానికి వాటి అనుభవం, వార్షిక అమ్మకాల పరమైన అర్హతలను ఎత్తివేస్తామని చెప్పారు.
స్టార్టప్ వ్యాపారాలు పేటెంట్లను రిజిస్టర్ చేసుకోవడానికి వీలుగా ఒక సరిళీకృత పేటెంట్ విధానం తీసుకొస్తామని పేర్కొన్నారు. అలాగే పేటెంట్లను రిజిస్టర్ చేసుకోవడానికి ఫీజును 80శాతంమేర తగ్గిస్తామని కూడా ప్రధాని ప్రకటించారు. దేశంలో ఉపాధి కల్పన, సంపద సృష్టికి అత్యంత కీలకమైన ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు.
అలాగే ప్రభుత్వ సేకరణ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి అనుభవం, టర్నోవర్ ప్రాతిపదకలను కూడా తొలగిస్తున్నట్టు మోడీ చెప్పారు. వ్యాపారం ప్రారంభించిన తొలి మూడేళ్లపాటు స్టార్టప్లు ఆర్జించే లాభాలకు ఆదాయ పన్ను చెల్లింపునుంచి మినహాయింపు ఇస్తామన్నారు.
అలాగే, తమ సొంత ఆస్తులు అమ్ముకుని పారిశ్రామికవేత్తలు పెట్టే పెట్టుబడులపైన, అలాగే ప్రభుత్వ గుర్తింపు వెంచర్ క్యాపిటలిస్టులు జరిపే పెట్టుబడులపైన విధించే 20శాతం క్యాపిటల్ గెయిన్ పన్ను కూడా మినహాయిస్తామన్నారు.
ఒకవేళ పరిశ్రమలకు నష్టాలువచ్చి వైదొలగాల్సి వస్తే 90 రోజుల్లోనే దివాలా చట్టంకింద సులభంగా వైదొలగే అవకాశాన్ని కల్పించనున్నామన్నారు. స్టార్టప్లపై రెగ్యులేటరీ భారాన్ని తగ్గించటం కోసమే స్వయం ధ్రువీకరణ విధానం తెస్తున్నామన్నారు. గ్రాడ్యుటీ చెల్లింపు, కాంట్రాక్టు లేబర్, ఉద్యోగుల భవిష్యనిధి, జల వాయు కాలుష్య చట్టాలకు ఈ స్వయం ధ్రువీకరణ వర్తిస్తుందన్నారు.
ప్రభుత్వం, రెగ్యులేటరీ సంస్థలతో సంప్రతింపులు జరపడం కోసం స్టార్టప్ మొబైల్ యాప్, పోర్టల్ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ నిబంధనలు సడలింపువల్ల స్టార్టప్లకు అనుభవమున్న పారిశ్రామికవేత్తలు లేదా కంపెనీలతో సమానంగా అవకాశాలు కల్పించినట్టు అవుతుందని తెలిపారు.
స్టార్టప్లకు నిధులు అందించేందుకు ప్రభుత్వం 2500 కోట్ల ప్రారంభ నిధితో నాలుగేళ్లలో పదివేల కోట్ల రూపాయలమేర కార్పస్ నిధి ఏర్పాటు చేయనున్నట్టు కూడా ప్రధాని తెలిపారు. ప్రయివేట్ నిపుణులు నిర్వహించే ఈ నిధికి ఎల్ఐసి సంస్థ సహా పెట్టుబడిదారిగా ఉంటుందన్నారు.
అలాగే రానున్న నాలుగేళ్లలో ఏడాది 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుద్వారా జాతీయ క్రెడిట్ ట్రస్ట్ కంపెనీని ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. యువత అంటే ఉద్యోగాలు కోరేవారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. భారత్లో తయారీ గురించి చెప్పేటప్పుడు భారత్ కోసం తయారు చేయండనీ చెప్పాల్సి ఉంటుందనీ, భారత్ అంటే గొప్ప మార్కెట్ అనీ చెప్పారు.