ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!!
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ అస్వస్థతకు గురై అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు. ఈ సంవత్సరం వందేళ్లు పూర్తి చేసుకున్న హీరాబెన్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వయసు పైబడటం తో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి ఆరోగ్యం పై ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపాయి. ఈ ఏడాది జూన్ 18వ తేదీన ఆమె 100 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే తన తల్లి హీరాబెన్ మోడీ అనారోగ్యానికి గల కారణాలను, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి అయిన హీరాబెన్ మోడీ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అభిమానులు, బిజెపి నాయకులు కోరుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి తన తల్లి హీరాబెన్ మోడీ పట్ల అమితమైన భక్తి భావం ఉంటుంది. ఆయన జీవితంలో తల్లికి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు. అనేక ప్రత్యేక సందర్భాలలో ప్రధాని మోడీ తల్లి వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు. తన తల్లి వద్ద కాసేపు గడిపి వస్తారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేసిన సమయంలో కూడా మోడీ తల్లి హీరాబెన్ మోడీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ప్రధాని మోడీకి తన తల్లి పట్ల అమితమైన ప్రేమ ఉందని అనేక సందర్భాలలో స్పష్టం చేశారు మోడీ . ప్రస్తుతం మోడీ తల్లి అనారోగ్యానికి గురికావడం, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని అనేక మంది భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.