మోడీ.. ఏడోసారి: కరోనాను జయించి తీరుతాం: రెండేళ్ల సంకల్పం: వారికి వందనాలు
న్యూఢిల్లీ: దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ ఉదయం రాజ్ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళిని అర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు.
లక్షలాది మంది మహనీయుల బలిదానాల ఫలితంగానే తాము స్వేచ్ఛా వాయువులను పీల్చుకోగలుగుతున్నామని అన్నారు. అఖండ భారతావనిని సంరక్షించే కార్యక్రమంలో నిమగ్నులైన కోట్లాదిమంది భద్రతా బలగాలు, పోలీసులకు తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. అరవింద్ ఘోష్ సేవలను స్మరించుకున్నారు. భారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిబింబంగా భావించే చిన్నారులు నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కనిపించకపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు.
రోజుల తరబడి కరోనా వైరస్ పేషెంట్లకు సేవలను అందిస్తోన్న ఫ్రంట్లైన్ వారియర్లను తాను నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు. ప్రాణాలను పోగొట్టుకున్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. కరోనా యుద్ధంలో విజయం సాధించి తీరుతామని, ఆ విశ్వాసం తనకు ఉందని ప్రధాని చెప్పారు. 130 కోట్ల మంది భారతీయుల ముందు కరోనా తలవంచక తప్పదని ధీమా వ్యక్తం చేశారాయన.

యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకం
భారత స్వాతంత్య్ర పోరాటం.. దేశాన్ని దాస్య శృంఖలాలన నుంచి విముక్తి కల్పించానికి మాత్రమే జరగలేదని ప్రధాని అన్నారు. ప్రపంచ మొత్తానికీ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని నింపిందని అన్నారు. పరాయి పాలనలో మగ్గుతోన్న అనేక దేశాలకు భారత స్వాతంత్య్ర పోరాటం ఓ దివిటీలా మారిందని చెప్పారు. దేశం మొత్తాన్నీ ఏకం చేసిన ఏకైక ఘటనగా దీన్ని అభివర్ణించారు. అనేక దేశాలు భారత పోరాటంతో స్ఫూర్తిపొందాయని చెప్పారు.

ఆత్మనిర్భర్ భారత్..
దేశ ప్రజలు కరోనా సంక్షోభం నుంచి బయటికి వస్తారని తాను ఆశిస్తున్నానని అన్నారు. ఆత్మనిర్భర్ నినాదం 130 కోట్ల మంది ప్రజల మంత్రంగా మారిందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కావడం.. అత్యవసరమని చెప్పారు. ఓ కుటుంబం తన కాళ్ల మీద తాను ఎలా నిలబడుతుందో.. అదే తరహాలో దేశం కూడా తన కాళ్ల మీద తాను నిల్చోవాల్సి ఉందని, అందుకే ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేయాల్సిన బాధ్యత యువత, మహిళా శక్తి మీద ఆధారపడి ఉందని మోడీ చెప్పారు.

ప్రపంచాన్ని నడిపించడానికి భారత్
ప్రపంచాన్ని నడిపించే బాధ్యతను భారత్ తీసుకోవాల్సి ఉందని, దీనికోసం ఆత్మనిర్భరత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని అన్నారు. ప్రపంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల నుంచి దేశం.. సర్వశక్తిమంతంగా ఎదుగుతుందని చెప్పారు. భారత్ నుంచి రా మెటీరియల్ను ప్రపంచ దేశాలకు అందించి.. అక్కడి నుంచి పాలిష్డ్ మెటీరియల్ను దిగుమతి చేసుకుంటున్నామని, ఇలా ఎంతకాలం కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు. అందుకే- ఆత్మనిర్భర్ పేరుతో స్వదేశంలో ఉత్పత్తులను ముమ్మరం చేయాలని అన్నారు.
Recommended Video

వ్యవసాయ రంగం నుంచి భారీ ఎగుమతులు..
భారత వ్యవసాయోత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడమే సంకల్పాన్ని దేశం తీసుకోవాలని అన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో అనేక విజయాలను నమోదు చేశామని, అదే తరహాలో అన్ని రంగాల్లోనూ వెనుతిరిగి చూడని ఫలితాలను సాధంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. దిగుమతులను తగ్గించుకోవడం అనేది తన అభిమతం కాదని.. దేశ యువతలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని, ఎగుమతులను ముమ్మరం చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications