చెన్నైలో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీఎం కరుణానిధితో భేటీ, సీఎం పళని, పన్నీర్ తో చర్చలు !
పలు కార్యక్రమాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చెన్నై చేరుకున్నారు. సోమవారం మూడు గంటలకు పైగా ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో పర్యటించనున్నారు.
చెన్నై: పలు కార్యక్రమాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చెన్నై చేరుకున్నారు. సోమవారం మూడు గంటలకు పైగా ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా తమిళనాడు డీజీపీ రాజేంద్రన్, చెన్నై నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రముఖ తమిళ దినపత్రిక 'దినతంతి' 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుక కార్యక్రమం జరుగుతున్నది. చెన్నై వర్శిటీ ఆడిటోరియంలో దినతంతి దిన పత్రిక యాజమాన్యం వజ్రోత్సవ వేడుకకు సర్వం సిద్దం చేసింది. దినతంతి వజ్రోత్సవ కార్యక్రమంతో పాటు ఎంఆర్ సీ నగర్ లో జరిగే మరో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు.
సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నైలోని మీనంబాక్కం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్ లో మెరీనా బీచ్ తీరంలోని ఐఎన్ ఎస్ హెలిప్యాడ్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చెన్నై వర్శిటీ చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 11.30 గంటలకు చెన్నై వర్శిటీలో కార్యక్రమం ముగించుకుని ఎంఆర్ సీ నగర్ లోని కళ్యాణమండపంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మద్యాహ్నం 12.30 గంటలకు గోపాలపురంలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎం. కరుణానిధి ఇంటికి ప్రధాని మోడీ వెలుతున్నారు.
#TamilNadu: PM Narendra Modi arrives in Chennai where he will attend multiple events, he will also meet former CM M Karunanidhi. pic.twitter.com/hXYJiJzUF4
— ANI (@ANI) November 6, 2017
తమిళనాడు సీనియర్ నాయకుడు ఎం. కరుణానిధితో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించనున్నారని తెలిసింది.