మోడీ ఆహ్వానించినా, సచిన్ మిస్, కారణాలు ఇవే...?
న్యూఢిల్లీ: ఆస్టేలియా పర్యటనకు అధికార బృందంలో తనతో పాటు రావాల్సిందిగా క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ను ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించినా.. కొన్ని ముందుస్తు కార్యక్రమాల కారణంగా వెళ్లలేకపోయారు.
సచిన్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకావిష్కరణ నిమిత్తం సచిన్ లండన్లో ఉన్నప్పుడే ప్రధాని కార్యాలయం ఆయనతో మాట్లాడింది. ఐతే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్న పుత్తంరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకునే నిమిత్తం అక్కడికి వెళ్లాల్సి ఉండటంతో పాటు ఇతర కార్యక్రమాల కారణంగా ఆస్టేలియా రాలేనని సచిన్ తెలిపినట్లు సమాచారం.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సవాల్ను స్వీకరించిన సచిన్ ఈ గ్రామాన్ని 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోచన' క్రింద ఈ గ్రామాన్ని దత్తతు తీసుకున్నట్లు తెలిపారు. ఈ గ్రామాన్ని రూ. 3.50 కోట్ల నిధులతో అభివృద్ది చేయనున్నట్లు సచిన్ ప్రకటించారు.
ఈ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు. నవంబర్ 16వ తేదీన సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని సందర్శించి అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పుత్తరాజుకండ్రిక గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలను నిర్మిస్తారు.