పార్లమెంటులో ఆందోళనలు: మాణికం ఠాగూర్ సహా నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్
న్యూఢిల్లీ: పలు అంశాలపై చర్చను డిమాండ్ చేస్తూ పార్లమెంటులో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. సభలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేసినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్సభ నుంచి సోమవారం మొత్తం ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు.
నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రతాపన్ సస్పెండ్ అయ్యారు. జూలై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ధరల పెరుగుదల, జీఎస్టీ రేటు పెంపు సమస్యలు రాజ్యసభ, లోక్సభ రెండింటిలోనూ అనేక వాయిదాలకు దారితీశాయి.
సోమవారం, కాంగ్రెస్, టిఎంసి, డీఎంకే విపక్ష సభ్యులు సభలో ధరల పెరుగుదలపై ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేయడంతో లోక్సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
వారు లేవనెత్తిన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా వారికి తెలియజేస్తూ.. సభ నడవాలని ప్రజలు కోరుకుంటున్నారని పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ, గందరగోళం కొనసాగడంతో, స్పీకర్ బిర్లా మొదట సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. కాగా, వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. దీంతో వాయిదాలు పడుతూ లోక్సభ, రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి.