ఎన్ఐఏ విచారణ: అదే రహదారిపైనే దాడులు ఎందుకు... పాక్ నుంచి ఫోన్ కాల్స్ పై దృష్టి
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఘటనపై విచారణ చేసేందుకు రంగంలోకి దిగింది జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ. ప్రాథమిక విచారణ అనంతరం దాడికి 10 నుంచి 15 కిలోల ఆర్డీఎక్స్ వినియోగించినట్లు విచారణ సంస్థ తెలిపింది. ఇక ఎన్ఐఏతో పాటు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కూడా ఘటనా స్థలం దగ్గరకు చేరుకోనుంది. అయితే 15 కిలోమీటర్లున్న పంపోర్ అవంతిపొరా రహదారినే ఉగ్రవాదులు ఎందుకు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారనే కోణంలో విచారణ చేసే అవకాశం ఉంది.
శ్రీనగర్ నుంచి ఘటన స్థలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇక ఫారెన్సిక్ పరీక్ష కోసం ఘటనా స్థలంలో దొరికిన కొన్ని శాంపిల్స్ను సేకరించారు. ఎన్ఎస్జీకి చెందిన నేషనల్ బాంబ్ డేటా సెంటర్ టీమ్ కూడా అక్కడికి చేరుకుని ఐఈడీ ప్రభావం ఏమేరకు చూపింది అనేది కూడా తేల్చే పనిలో పడ్డారు. దాడి సమయంలో కాన్వాయ్లో ఉన్న ఇతర సీఆర్పీఎఫ్ జవాన్లను, జమ్ముకశ్మీర్ పోలీసులను కూడా ఎన్ఐఏ విచారణ చేసినట్లు తెలుస్తోంది.
పుల్వామా ఎఫెక్ట్ః రిసెప్షన్ రద్దు చేసుకుని అమరుల కుటుంబాలకు ఆ జంట ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా?
ఇక దగ్గరలోని టెలిఫోన్ టవర్లను కూడా పరిశీలించింది ఎన్ఐఏ. ఆ టవర్ నుంచి ఏమైనా అనుమానిత ఫోన్ కాల్స్ వెళ్లాయా అనేదానిపై కూడా దృష్టి సారించింది. జైషే మహ్మద్ దాడికి తామే బాధ్యులమని ప్రకటించడంతో పాత రికార్డులను తిరిగేసే పనిలో పడింది ఎన్ఐఏ. పాత రికార్డుల్లో ఉన్న నెంబర్ల నుంచి దాడికి కొద్ది రోజుల ముందు ఏమైనా అనుమానిత ఫోన్కాల్స్ వెళ్లాయా అన్న కోణంలో కూడా విచారణ సంస్థ ఆరా తీస్తోంది. ఇక దాడికి కారును వినియోగించారు కాబట్టి బాంబు దాడికి పాల్పడే ఒక్క రోజు ముందే బాంబును కారులోనే తయారు చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేసింది.