పోలింగ్కు రెడీ: కూపన్ల ద్వారా డ్రగ్స్, ఆల్కాహాల్ పంపిణీ
పంజాబ్ రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థులు రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటర్లకు ఆల్కాహాల్, డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారని అధికారులు నిర్ధారించారు.
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థులు రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటర్లకు ఆల్కాహాల్, డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారని అధికారులు నిర్ధారించారు. శనివారం పోలింగ్ జరుగనున్న పంజాబ్ రాష్ట్రంలో ఓటర్లకు డ్రగ్స్, ఆల్కాహాల్ పంపిణీ కోసం వందల కూపన్లు పంపిణీ జరిగాయని ఎన్నికల సంఘం, నిఘా అధికారులు కూడా గుర్తించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికె సింగ్ కూడా కీలక జిల్లాల్లో ఆల్కాహాల్ దుకాణాలపై నిఘా పెట్టారు. పలువురు కుర్రాళ్లు ఇంజక్షన్ల రూపంలో డ్రగ్స్ తీసుకునేందుకు నీడిల్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ డ్రగ్స్తోపాటు ఆల్కాహాల్, ఇతర పదార్థాల సరఫరాకు తొలిసారి రాష్ట్రంలో కూపన్ల వ్యవస్థ అవతరించిందని ఎన్నికల ప్రధానాధికారి వికె సింగ్ వివరించారు. ఈ విషయం తాము ఏర్పాటు చేసిన '24 గంటల కాల్ సెంటర్' ద్వారా ప్రజలు ఫిర్యాదుల రూపంలో సమాచారం అందజేస్తున్నారని అన్నారు.
కాటన్ మిల్లులో 10 వేల మద్యం బాటిళ్లు
గత వారం ఒక కాటన్మిల్లు నుంచి 10 వేల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని వికె సింగ్ తెలిపారు. అయితే ఇది సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ పోటీ చేస్తున్న లాంబీ నియోజకవర్గంలో మాత్రం కాదని అన్నారు. కూపన్ల ద్వారా ఆల్కాహాల్, డ్రగ్స్ పంపిణీ విధానం ప్రస్తుతం వినూత్న విధానంగా మారిందని వికె సింగ్ అన్నారు. రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆల్కాహాల్ పంపిణీచేస్తున్నారని, దీన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.
స్నిప్పర్ డాగ్స్తో డ్రగ్స్ పంపిణీపై నిఘా
డ్రగ్స్ పంపిణీపై నిఘా కోసం ప్రత్యేకంగా స్నిప్పర్ డాగ్స్ వినియోగిస్తున్నామని వికె సింగ్ చెప్పారు. మారుతి జెన్ కారులో తనిఖీలు చేయడంతో ఒక వ్యక్తి వద్ద 50 కిలోల డ్రగ్స్ దొరికాయి. రాష్ట్రమంతా డ్రగ్స్ మహమ్మారి వ్యసనంగా మారి యువతను నిర్వీర్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలిస్తామని అన్ని పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పంజాబీలకు హామీనిచ్చాయి. కానీ కిలోల కొద్ది డ్రగ్స్ వాహనాలు, రైళ్ల ద్వారా రవాణా చేస్తూ వ్యసనపరులకు పంపిణీ చేస్తున్నారు. లాహోర్ నుంచి గూడ్స్ రైలు నుంచి స్మగుల్డ్ డ్రగ్స్ రాష్ట్రానికి వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికె సింగ్ వివరించారు.
పంజాబ్, గోవాల్లో రేపే పోలింగ్
గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం శనివారం పోలింగ్ జరుగనున్నది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి గల ప్రజాదరణకు ఈ ఎన్నికలు పరీక్ష కానున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో 117, గోవాలో 40 స్థానాల అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ అనారోగ్యం కారణంగా తొలిసారి ఆమె ప్రచారానికి దూరంగా ఉండగా ఆమె తనయుడు రాహుల్ గాంధీ అన్నింటా తానై వ్యవహరించారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విస్త్రుతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరును రాహుల్ గాంధీ ప్రకటించారు.
ప్రధాని ప్రభ్రుతుల విస్త్రుత ప్రచారం
ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీ, తదితరులు రెండు రాష్ట్రాల్లో విస్త్రుత ప్రచారంచేశారు. పంజాబ్ రాష్ట్రంలో పదేళ్లుగా అదికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ - బిజెపి సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత కానవస్తోంది. ఈ నేపథ్యంలో అధికార అకాలీదళ్ - బిజెపి కూటమితోపాటు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) పోటీ పడ్తున్నాయి.
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, అవినీతి, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ మాత్రం తొలిసారి గోవా, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఎన్నికల్లో పోటీచేస్తోంది. అంతే కాదు ఆ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. పంజాబ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మాఫియా, వివాదాస్పద ఎస్వైఎల్ కెనాల్, వారసత్వ రాజకీయాలు తదితర అంశాలు సమస్యగా మారాయి.
2014లో నాలుగు స్థానాల్లో విజయంతో ఆప్ బలోపేతం
పంజాబ్ రాష్ట్రంలోని మాల్వా రీజియన్ పరిధిలో గల నాలుగు లోక్ సభ స్థానాలను గెలుచుకున్న ఆప్ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్కరిని సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. పార్టీ ఎంపి భగవాన్ మాన్ మాత్రం ఎన్నికల ప్రచారం ముగిసే వరకు మాల్వా రీజియన్ అంతా చుట్టి వస్తూ ప్రజల్లోకి ఆప్ వాణిని విజయవంతం చేయగలిగారు. ఒకవేళ పార్టీ విజయం సాధిస్తే సీఎం అభ్యర్థిగా భగవత్ మాన్ ఉంటారు. ఆప్ తరఫున ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, నేతలు సంజయ్ సింగ్ తదితరులు విరివిగా ప్రచారంచేశారు.
గోవాలో బిజెపికి ఆర్ఎస్ఎస్ తిరుగుబాటు నేత ఎఫెక్ట్
గోవాలో అధికార బిజెపికి సొంత సంఘ్ పరివార్లోనే తిరుగుబాటు చుక్కలు చూపుతోంది. దీని కారణంగానే సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారం ముగించారు కమలనాథులు. సీఎం లక్ష్మీకాంత్ పర్సెకర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి వెనుకాడడానికి కారణం ఆయన పట్ల ప్రజా వ్యతిరేకతే కారణమేనని అంటున్నారు. ఆప్ తరఫున ఎల్విస్ గోమ్స్ ప్రచార బరిలో గోవా అంతా హోరెత్తించారు. పోలింగ్ నేపథ్యంలో రెండు రాష్ట్రాల పరిధిలో నిషేధాజ్నలు అమలులో ఉన్నాయి.