ఆన్ లైన్ క్యాంపెయిన్ కష్టమే.. రూరల్ ఏరియాల్లో ఎలా: SAD
5 రాష్ట్రాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసుల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు ప్రచారం, ర్యాలీలు, సభలకు అనుమతి ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని కోరింది. దీనిపై అప్పుడే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కామెంట్ చేశారు. ఇదీ సరికాదని.. విత్ డ్రా చేసుకోవాలని కోరారు. యూపీలో ఇంటర్నెట్ వినియోగం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు శిరోమణి అకాళిదల్ స్పందించింది.
పంజాబ్లో కొన్ని రూరల్ ఏరియాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆన్ లైన్ ప్రచారం కష్టమని ఎస్ఏడీ అభిప్రాయపడింది. తాము ఇప్పటికే ప్రత్యక్షంగా ప్రచారం చేశామని.. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా వారిని చేరుకోలేకపోతున్నామని వివరించింది. కొన్ని నియోజకవర్గ ప్రజలను వర్చువల్ చేరుకోవడం కష్టం అవుతుందని ఎస్ఏడీ నేత దల్జిత్ సింగ్ చీమా అభిప్రాయపడ్డారు.
తన నియోజకవర్గం రొపర్ అని.. గ్రామీణ ప్రాంతంలోకి చేరుకోవడం అసాధ్యం అని చెప్పారు. ఇలాంటి ప్రాంతాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని చెప్పారు. ఇతరులు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారని వివరించారు. సమస్యను సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాడని చెప్పారు. ర్యాలీలు, ఎక్కువ మంది సామూహం ఉండటంపై నిషేధం ఉన్నా.. గ్రూపు మీటింగ్స్ కోసం అనుమతి ఇవ్వాలని కోరారు.
ఫిబ్రవరి 14న పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28తో నామినేషన్లు ముగియనున్నాయి. జనవరి 30 వరకు విత్డ్రాకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు.