ఎన్నికల వేళ పంజాబ్ సీఎం సంచలనం - ఎన్నికలు వాయిదా వేయండి : ఈసీకి లేఖ..!!
దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల వేడి రాజుకుంది. తొలి విడత పోలింగ్ కు నోటిఫికేషన్లు సైతం జారీ అయ్యాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి ఫోకస్ ఉత్తర ప్రదేశ్ తో పాటుగా పంజాబ్ పైనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే పంజాబ్ ఎన్నికల నిర్వహణ పైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ సంచలనానికి తెర లేపారు. ఫిబ్రవరి 14న రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తూ.. ఎన్నికల నిర్వహణకు సిద్దమైంది.
సీఎం రాసిన లేఖలో ప్రధానంగా
అయితే, ఇప్పుడు సీఎం రాసిన లేఖ రాజకీయంగా ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారుతోంది. ఏకంగా పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయలంటూ ఆ లేఖలో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలను వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని చరణ్జిత్ సింగ్, ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఆ వర్గానికి చెందినవారు దాదాపు 32 శాతంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.
పోలింగ్ పైనా ప్రభావం
ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు యూపీలోని బెనారస్లో జరగనున్న గురు రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గనేందుకు తమ రాష్ట్రం నుంచి దాదాపు 20 లక్షల మంది వెళ్లే అవకాశం ఉన్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... ఫిబ్రవరి 14 న ఎన్నికలు నిర్వహిస్తే లక్షల మంది తమ రాజ్యాంగపరమైన హక్కుగా ఉన్న ఓటు హక్కును వినియోగించుకోలేరని తెలిపారు. అందువల్ల పోలింగ్ తేదీని పొడిగించినట్లయితే బెనారస్ వెళ్లి రావడంతోపాటు ఓటు హక్కు వినియోగించుకోగలుగతామని వారు కోరిన విషయాన్ని లేఖలో వివరించారు.
సీఈసీ స్పందిస్తుందా.. వాయిదా వేస్తుందా
అందువల్ల ఈ అసెంబ్లీ వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకొనేలా కనీసం ఆరు రోజులైనా ఎన్నికలను వాయిదా వేయాలని చన్నీ సిఈసి ని కోరారు. అయితే, అయిదు రాష్ట్రాలతో ముడి పడి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పుడు సీఎం రాసిన లేఖ పైన ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందిస్తుందా.. లేక, మార్పు సాధ్యం కాదని చెబుతుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే,పోలింగ్ తేదీ మార్చకుంటే పోలింగ్ పైన ప్రభావం పడే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.