పంజాబ్ ప్రజల తీర్పు అద్భుతం: కాంగ్రెస్ ఓటమిపై నవజ్యోత్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజంయ సాధించిన విషయం తెలిసిందే. అయితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంతేగాక, ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని సహా, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు. కాగా, ఈ ఎన్నికల ఫలితాలపై సిద్దూ ఆసక్తికరంగా స్పందించారు.
పంజాబ్ ప్రజల తీర్పు అద్భుతం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
కొత్త వ్యవస్థకు నాంది పలికే క్రమంలో ఈ అద్భుత నిర్ణయం తీసుకున్న ప్రజలను అభినందించాలనుకుంటున్నట్లు సిద్ధూ తెలిపారు. పంజాబ్ ప్రజల నిర్ణయం అద్భుతమని వర్ణించారు. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయన నుంచి ఇలాంటి మాటలు రావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తమరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారేంటి అని ప్రశ్నించిన మీడియాకు తనదైన శైలిలో జవాబిచ్చారు.
ప్రజలు తప్పు చేయరంటూ సిద్ధూ
ప్రజల మార్పు కోరుకున్నారు. వారు తప్పు చేయరు. ప్రజల తీర్పే దేవుడి తీర్పు.. మనం దానిని వినయంతో అంగీకరించాలి అని నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించారు. పంజాబ్ అభివృద్ధి కోసం తన ప్రయత్నాలు కొనసాగుతాయని సిద్ధూ తెలిపారు. ఒక యోగి ధర్మయుద్ధంలో ఉన్నప్పుడు తనకు హద్దులు గీసుకోడు. మరణం గురించి భయపడడు. నేను పంజాబ్ లోనే ఉన్నాను. ఉంటాను. పెద్ద లక్ష్యాలు నిర్ణయించుకున్నావారు.. గెలుపోటముల గురించి పట్టించుకోరు అని సిద్ధూ చెప్పుకొచ్చారు.
చన్నీ, కాంగ్రెస్ అధిష్టానంపై పరోక్షంగా సిద్ధూ వ్యాఖ్యలు
తనను కిందికి తోయాలని చూసిన కొందరు.. ప్రజల చేతిలో ఓటమి పాలయ్యారంటూ విమర్శలు చేశారు సిద్ధూ. అయితే, కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత తీసుకునేందుకు మాత్రం ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. నేను ముఖ్యమంత్రి అభ్యర్థి కానందున పంజాబ్ అంతటా ప్రచారం చేసే అధికారం నాకు లేదు. ఇది చన్నీ బాధ్యత. చన్నీని రాహుల్ గాంధీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పుడే.. ప్రచారం మొత్తం ఆయన బాధ్యతే అని నేను చెప్పపేశాను అని సిద్ధూ తప్పించుకున్నారు. అంతేగాక, ప్రజలు చన్నీని అంగీకరించారా? లేదా? అనేది తాను చెప్పలేనని అన్నారు. అంటే, కాంగ్రెస్ ఓటమికి పరోక్షంగా చన్నీ, పార్టీ అధిష్టానానిదే అన్నట్లుగా సిద్ధూ వ్యవహరించారు. కాగా, పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలుండగా ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 18 స్థానాలే దక్కాయి. ఎస్ఏడీ 3, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి.