ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణం: ప్రధాని మోడీ హాజరు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత పుష్కర్ సింగ్ ధామి(46) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా రెండోసారి ఆయన సీఎం పదవి చేపట్టారు. ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్.. ధామి చేత సీఎంగా ప్రమాణం చేయించారు. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ పరేడ్ గ్రౌడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తోపాటు కాబోయే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. చందన్ రామ్ దాస్, సౌరభ్ రావత్, ప్రేమ్ చంద్ అగర్వాల్ కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.
కాగా, ఇటీవల ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 స్థానాలకు గానూ 47 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే, సొంత స్థానం ఖటిమాలో పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు. దీంతో తదుపరి సీఎం ఎవరనేదానిపై గత కొద్ది రోజులుగా చర్చ జరిగింది. సీఎం రేసులో ముందు వరుసలో పుష్కర్ సింగ్ ధామి ఉండగా, ఆ తర్వాత మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, మాజీ కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సత్పాల్ మహారాజ్ వంటి వారున్నారు.
Prime Minister Narendra Modi and other BJP leaders attend the swearing-in ceremony of Uttarkhand CM-designate Pushkar Singh Dhami in Dehradun. pic.twitter.com/lsAWXgsvul
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2022
అయితే, ఎన్నికల్లో పుష్కర్ సింగ్ ధామి ఓడినప్పటికీ.. బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహారించారని పార్టీ నేతలు భావించారు. అందుకే మరోసారి పుష్కర్ సింగ్ ధామినే ముఖ్యమంత్రి పదవిలో కూర్చుకునేందుకు అంతా అంగీకరించారు. దీంతో రెండోసారి పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.