అమెరికా జైలు నుంచి విడుదలైన ‘క్వీన్ ఆఫ్ క్యూబా’ - ఎవరీ గూఢచారి? అమెరికాకు ఎలా నష్టం చేశారు
అనా మోంటెస్ను అమెరికా నిఘా సంస్థలు ''ద క్వీన్ ఆఫ్ క్యూబా’’గా పిలుస్తుంటాయి. క్యూబాలోని సీక్రెట్ సర్వీస్లోనూ ఆమె అలానే సుపరిచితురాలు.
అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ)లోని క్యూబా రాజకీయ, సైనిక అంశాలను విశ్లేషించే అనలిస్ట్గా 1985 నుంచి 2001 మధ్య అనా పనిచేశారు.
తన కెరియర్లో అనాకు ప్రమోషన్లతోపాటు పది ప్రత్యేక అవార్డులు కూడా వచ్చాయి. నేషనల్ ఇంటెలిజెన్స్ సర్టిఫకేట్ ఆఫ్ డిస్టింక్షన్ను కూడా ఆమె అందుకున్నారు. ఇది అమెరికా నిఘా విభాగంలో ఇచ్చే మూడో అత్యున్నత అవార్డు. 1997లో అప్పటి అమెరికా గూఢచర్య విభాగం సీఐఏ జార్జ్ టెనెట్ దీన్ని ఆమెకు ఇచ్చారు.
అయితే, ఆమె సేవలు డీఐఏలో కంటే క్యూబాలోని ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వానికి బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకోవాలి. అమెరికా సేకరించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఆమె క్యూబాకు చేరవేశారు.
''మొదటిరోజు డీఐఏలోకి అడుగుపెట్టినప్పటికే ఆమె క్యూబన్ ఇంటిలిజెన్స్ సర్వీస్ ఏజెంట్. పని మొదలుపెట్టే ముందు, ఒక విషయాన్ని ఆమె రోజూ గుర్తుపెట్టుకునేవారు. అదేమిటంటే.. అమెరికా నుంచి తమకు రక్షణ కల్పించే సమాచారాన్ని క్యూబన్లు తెలుసుకోవాలి’’ అని అనాపై దర్యాప్తు చేపట్టిన ఇద్దరు ఎఫ్బీఐ ఏజెంట్లలో ఒకరైన పీటర్ ల్యాప్ చెప్పారు.
2001లో క్యూబాకు సమాచారం చేరవేస్తూ అనా పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆమెకు అమెరికా కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా ఆమె జైలు నుంచి విడుదల అయ్యారు.
- చైనా డిజిటల్ గూఢచర్యం... వేల మంది భారతీయులు నిఘా నీడలో ఉన్నారా?
- ఎడ్వర్డ్ స్నోడెన్: అమెరికా నిఘా రహస్యాలు బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగికి రష్యా పౌరసత్వం – ఎవరీ స్నోడెన్?
ప్రధాన గూఢచారి
''ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అరెస్టైన ప్రధాన గుఢచారుల్లో ఆమె కూడా ఒకరు. ఆమె వల్ల అమెరికాకు చాలా నష్టం జరిగింది’’ అని ల్యాప్ చెప్పారు.
ఆమె కేసులో చేపట్టిన దర్యాప్తు అనంతరం ''ద క్వీన్ ఆఫ్ క్యూబా’’ పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు. ఈ ఏడాది అక్టోబరులో దాన్ని విడుదల చేయబోతున్నారు.
20 ఏళ్లకు పైగా జైలులో గడిపిన తర్వాత జనవరి 7న అనా విడుదల అయ్యారు. ఇప్పుడు ఆమె వయసు 65 ఏళ్లు. జైలు నుంచి విడుదలైనా ఐదేళ్లపాటు పోలీసుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.
ఆమె ఇంటర్నెట్ వినియోగాన్ని కూడా అధికారులు ఒక కంట కనిపెడుతుంటారు. ప్రభుత్వం కోసం పనిచేయకుండా ఆమెపై ఆంక్షలు విధించారు. విదేశీ ఏజెంట్లను కూడా అనుమతి లేకుండా కలవడానికి వీల్లేదు.
ఇంతకీ అనా మోంటెస్ ఎవరు? అమెరికాపై అంతకాలం ఆమె ఎలా నిఘా పెట్టగలిగారు?
- శాపోర్ మోయినియాన్: 'అవును... నేను అమెరికా సెక్యూరిటీ సీక్రెట్స్ను చైనాకు దొంగతనంగా పంపించాను'
- భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి పాకిస్తాన్కు రహస్య సమాచారం ఇచ్చారా... అలా ఆరోపించిన నుస్రత్ మీర్జా ఎవరు?
మంచి విద్యార్థి నుంచి గూఢచారిగా
ప్యూర్టోరికో దంపతులకు జర్మనీలోని అమెరికా సైనిక స్థావరంలో 1957లో అనా జన్మించారు. అనా తండ్రి డాక్టరుగా పనిచేసేవారు. ఆ తర్వాత వీరి కుటుంబం కేన్సస్కు, అక్కడి నుంచి మేరీల్యాండ్కు వచ్చింది. స్కూల్లో మంచి ప్రతిభావంతురాలైన విద్యార్థిగా అనాకు పేరుంది.
వర్జీనియా యూనివర్సిటీ నుంచి ''ఇంటర్నేషనల్ రిలేషన్స్’’లో ఆమె డిగ్రీ పట్టా పొందారు. చదువులో భాగంగా 1977లో ఆమె స్పెయిన్కు కూడా వెళ్లొచ్చారు. అక్కడే అర్జెంటీనా వామపక్ష విద్యార్థి ఒకరిని ఆమె కలిశారు. అర్జెంటీనాలో నిరంకుశ ప్రభుత్వాలకు అమెరికా ఇస్తున్న మద్దతు గురించి అతడి నుంచి ఆమె తెలుసుకున్నట్లు ఆమె స్నేహితురాలైన అనా కోలన్ 2013లో వాషింగ్టన్ పోస్టుకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
''ఒక్కోచోటకు వెళ్లి వచ్చిన తర్వాత అమెరికా ప్రభుత్వం ఆయా దేశాల్లో చేపడుతున్న 'అరాచక కార్యకలాపాల’ గురించి అనా చెప్పేది’’ అని కోలన్ గుర్తు చేసుకున్నారు.
డిగ్రీ పూర్తయిన తర్వాత అనా ప్యూర్టోరికోకు వెళ్లారు. అయితే, అక్కడ ఆమెకు ఉద్యోగం లభించలేదు. ఆ తర్వాత వాషింగ్టన్ డిసీ న్యాయ సేవల విభాగంలో వచ్చిన ఒక జాబ్ ఆఫర్ను ఆమె తీసుకున్నారు.
అక్కడ పనిచేస్తూనే ఆమె జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో మాస్టర్ డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మాస్టర్ డిగ్రీ చదువుతున్నప్పుడే ఒక క్యూబా గూఢచారి ఆమెలో ప్రతిభను గుర్తించారు. క్యూబా కోసం పనిచేయాలని ఆమెకు సూచించారు.
''ప్యూర్టోరికోకు చెందిన మార్టా రీటా వాలెంక్విజ్తో ఆమెకు పరిచయం పెరిగింది. నికరాగువా, ఎల్ సాల్వడోర్లలో అమెరికా చర్యల గురించి మార్టా ఎదుట అనా ఆగ్రహం వ్యక్తంచేసేవారు. వీరిద్దరూ అలా మంచి స్నేహితులయ్యారు. అప్పుడే వాషింగ్టన్ న్యాయసేవల విభాగంలో అనాకు తెలిసినవారు చాలా మంది ఉన్నారని మార్టా తెలుసుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఐరాసలోని క్యూబా మిషన్ కోసం పనిచేస్తున్న ఒక దౌత్యవేత్తతో అనా కలిసేందుకు మార్టా ఏర్పాట్లు చేశారు’’ అని ల్యాప్ వివరించారు.
అలా క్యూబా ఏజెంట్గా అనా మారిపోయారు.
- CIA: అమెరికా గూఢచార సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా భారతీయ అమెరికన్ నంద్ మూల్చందానీ
- 'ఈ చట్టం అమల్లోకి వస్తే ఫింగర్ప్రింట్స్, రెటీనా స్కాన్తో పాటు బయోలాజికల్ శాంపిల్స్ కూడా సేకరించొచ్చు’
సిద్ధాంతాలు..
మొదట్లో అసలు క్యూబాతో కలిసి పనిచేస్తానని తను ఊహించుకోలేదని అమెరికా అధికారుల ఎదుట అనా చెప్పారు.
''ఆమెకు వారు ఎలాంటి డబ్బూ ఇచ్చేవారు కాదు. సైద్ధాంతిక కారణాలతో ఆమె వారి కోసం పనిచేశారు. ఒకవేళ క్యూబా తనకు డబ్బు ఇచ్చుంటే ఆమె నొచ్చుకునేవారేమో’’ అని ల్యాప్ వివరించారు.
తను పట్టుబడిన తర్వాత కూడా.. అమెరికా విధానాల నుంచి క్యూబన్లను రక్షించేందుకే తాను పనిచేసినట్లు ఆమె వెల్లడించారు.
''క్యూబా విషయంలో మన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అరాచకమైనవి. అందుకే వారికి సాయం చేయాలని నేను భావించాను. మన విలువలు, రాజకీయ ఉద్దేశాలు వారిపై రుద్దడం సరికాదని మొదట్నుంచీ నేను అనుకునేదాన్ని’’ అని అధికారుల ఎదుట అనా చెప్పారు.
క్యూబన్లకు చాలా సాయం అవసరముందని క్యూబా ఏజెంట్లు ఆమెను నమ్మించగలిగారని చెబుతున్న ఒక సీఐఏ రిపోర్టుపై వాషింగ్టన్ పోస్టు కూడా ఒక కథనాన్ని ప్రచురించింది.
''ఆమె సైద్ధాంతిక భావజాలాన్ని ఆ ఏజెంట్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏళ్లపాటు క్యూబా కోసం నిబద్ధతతో పనిచేసేలా ఆమెను మార్చేశారు’’ అని ఆ సీఐఏ నివేదిక వెల్లడించింది.
అయితే, ఇక్కడ వామపక్ష భావజాలంతోపాటు అమెరికాపై అనాలో గూడుకట్టుకున్న ద్వేషం కూడా ప్రధాన పాత్ర పోషించిందని ల్యాప్ భావిస్తున్నారు.
''ఆమెలో చాలా అమెరికా వ్యతిరేక భావజాలముంది. నికరాగువా, ఎల్ సాల్వడోర్లలో అమెరికా ప్రభుత్వ చర్యల విషయంలో ఆమె చాలా అసంతృప్తితో ఉండేవారు. కేవలం వామపక్ష భావజాలం మాత్రమే దీనికి కారణం కాదు. ఆమెకు అమెరికాపై చాలా ద్వేషముంది. అదే సమయంలో క్యూబాపై విపరీతమైన ప్రేమ కూడా’’ అని ఆయన చెప్పారు.
- పెగాసస్: గూఢచర్య ఆరోపణలపై చర్చలను మోదీ ప్రభుత్వం ఎందుకు దాటవేస్తోంది?
- ఒక పవర్పాయింట్ ప్రజెంటేషన్ చైనా-అమెరికా-కెనడా సంబంధాలను ఎలా మార్చిందంటే..
హవానాకు కూడా..
1985లో హవానాకు కూడా అనా వెళ్లారు. అయితే, సమాచార సేకరణకు అమెరికానే అక్కడకు ఆమెను పంపించేది. అక్కడ పనిచేస్తున్న అమెరికా అధికారులను ఆమె కలిశారు. ఆ తర్వాత క్యూబా బాసులతోనూ సమావేశమయ్యేవారు.
అప్పుడే డీఐఏ కోసం పనిచేసేలా ఆమెను క్యూబా ఏజెంట్లు ప్రోత్సహించారు. అలా ఆమె డీఐఏలోకి అడుగుపెట్టారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు ఆమె నివేదికలు సమర్పించేవారు.
అరెస్టుకు ముందుగా ఆమెను నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్లో సభ్యురాలిగా నియమించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. సీఐఏకు ఈ కౌన్సిల్ సలహాలు, సూచనలు ఇస్తుంది.
అనా మంచి విశ్లేషకురాలని ల్యాప్ వివరించారు. దీంతో ఇటు వాషింగ్టన్లో, అటు హవానాలో రెండు చోట్ల ఆమె తన ప్రతిభను మెరుగ్గా ఉపయోగించేవారని ఆయన అన్నారు.
''కేవలం తన డెస్కు ముందు గంటలపాటు కూర్చొని రోజు గడిపేసుంటే 'క్వీన్ ఆఫ్ క్యూబా’గా ఆమె మారేవారు కాదు. ఆమె చాలా మంది విశ్లేషకురాలు. ఆమె తన తెలివిని ఉపయోగించేకొద్దీ మరిన్ని అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చేవి. ఆమె అనలిస్టుగా మెరుగ్గా పనిచేయడంతో క్యూబా ఏజెంట్ల కోసం సమాచారం సేకరించడం మరింత సులువైంది’’ అని ల్యాప్ చెప్పారు.
- అమెరికా సీఐఏ గూఢచారులను రష్యా 'రహస్య మైక్రోవేవ్ ఆయుధాల’తో చంపాలని చూస్తోందా?
- 'చైనా తరఫున అమెరికాలో గూఢచర్యం చేస్తున్నా’ - సింగపూర్ పౌరుడు
ఎలా తప్పించుకునేవారు?
తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ''స్పై టూల్స్’’ను అనా ఉపయోగించేవారు. గంటలపాటు కూర్చొని రహస్య సమాచారాన్ని చదివి ఆమె గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత రాత్రిపూట తన తొషిబా ల్యాప్టాప్ సాయంతో ఆ సమాచారాన్ని మళ్లీ టైప్చేసి ఫ్లాపీ డిస్కుల్లోకి ఎక్కించేవారు. వీటిని ఏజెంట్లకు ఇచ్చేవారు. అందువల్ల ఆమె ఎలాంటి పత్రాలను ఆఫీసు నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చేదికాదు.
మంగళవారం, గురువారం, శనివారం ఒక ఒక షార్ట్వేవ్ రేడియోను రాత్రిపూట 9 నుంచి పది మధ్య ఆమె ఉపయోగించేవారు. దానిలో నంబర్లలో ఒక సందేశం వచ్చేది. ''అటెన్షన్ 3, 1, 4, 5...’’ ఇలా ఆ సందేశం ఉండేది. దీన్ని ఒక కోడ్ షీట్ సాయంతో ఆమె విశ్లేషించేవారు. ఆ కోడ్ షీట్ను నీటిలో పెడితే కరిగిపోయి మాయం అవుతుంది.
అలా ఆమె క్యూబా ఏజెంట్ల నుంచి సమాచారం, ఆదేశాలు తీసుకునేవారు.
అయితే, తను సమాచారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఆ క్యూబా ఏజెంట్లతో భోజనానికి హోటల్కు వెళ్లేవారు. ''ఆ హోటల్లోనే ఆమె ఫ్లాపీ డిస్కులను అందించేవారు. ఇక్కడ ఎలాంటి టెక్నిక్లు ఉండేవి కాదు. ఇది చాలా సాధారణ సమావేశంలా కనిపించేది’’ అని ల్యాప్ వివరించారు.
అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే, ఆమె పబ్లిక్ ఫోన్ బూత్ ఉపయోగించేవారు. అప్పుడు కూడా కోడ్ భాషలో మాట్లాడేవారు.
- ఇరాన్ అణు శాస్త్రవేత్తలు వరుసగా ఎందుకు హత్యకు గురవుతున్నారు? ఇది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఆపరేషనా?
- రష్యా - బ్రిటన్ 'ది గ్రేట్ గేమ్': భారత్ను కాపాడుకోవాలని ఒకరు, ఆక్రమించుకోవాలని మరొకరు... చివరికి ఏం జరిగింది
అమెరికాకు విపరీత నష్టం..
అనా వల్ల అమెరికాకు విపరీత నష్టం జరిగినట్లు ల్యాప్ వివరించారు. ''అమెరికా కోసం పనిచేసే చాలా మందితో ఆమె మాట్లాడేవారు. అసలు క్యూబా నుంచి అమెరికా కోసం ఎవరు పనిచేస్తున్నారో ఆమె తెలుసుకునేవారు. ఫలితంగా క్యూబాలో తమకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారో కనుక్కోవడం అక్కడి ఏజెంట్లకు తేలికయ్యేది’’ అని ల్యాప్ వివరించారు.
''ఆమె ల్యాప్టాప్లో చాలా సమాచారం మాకు దొరికింది. క్యూబాలో పనిచేసేందుకు వెళ్లిన నలుగురు అమెరికా గూఢచారుల సమాచారం కూడా దానిలో ఉంది’’ అని ఆయన వివరించారు.
అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఏజెంట్ గ్రీన్ బెరెట్.. ఎల్ సాల్వడోర్లో హత్యకు గురికావడం వెనుక కూడా అనా పాత్ర ఉన్నట్లు ఒక మాజీ ఎఫ్బీఐ ఏజెంట్ ఆరోపించారు.
''ఆ ఆరోపణలు మేం నిరూపించలేం. కానీ, ఆయన ఎవరో క్యూబన్లకు ఆమె చెప్పేసి ఉంటారు. ఆయన ఏ మిషన్పై వచ్చారో కూడా సమాచారం అందించి ఉంటారు. తన చర్యల వల్ల ఎవరు చనిపోతున్నా.. ఎంత నష్టం జరిగినా.. ఆమె పట్టించుకునేవారు కాదు’’ అని ల్యాప్ చెప్పారు.
- పెగాసస్: 'డ్రైవర్ తాగి నడిపితే, తప్పు కారు తయారు చేసిన కంపెనీది అవుతుందా?'
- వీడియో, సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి
అరెస్టుకు ముందు కూడా..
అఫ్గానిస్తాన్లో అమెరికా సైనిక ఆపరేషన్ గురించి కూడా అరెస్టుకు ముందుగా అనా సమాచారం సేకరించారు. బహుశా ఇది క్యూబాకు చేరుంటే.. తాలిబాన్ లేదా అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చల కోసం క్యూబా ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకొని ఉండొచ్చని కూడా విశ్లేషణలు వచ్చాయి.
అయితే, అనాపై అమెరికా అధికారులు అంతకుముందు నుంచే నిఘాపెట్టారు. సెప్టెంబరు 11 దాడుల నడుమ, వెంటనే ఆమె అరెస్టు ప్రక్రియల్లో వేగం పెంచారు.
మొత్తంగా అదే ఏడాది సెప్టెంబరు 21న ఆమెను అరెస్టు చేశారు. తను విచారణకు పూర్తిగా సహకరిస్తాని అమెరికా అధికారులతో ఆమె ఒప్పందం చేసుకున్నారు. ఫలితంగా 25 ఏళ్లకు మించి జైలు శిక్ష పడకుండా చూడాలని హామీ తీసుకున్నారు.
మొత్తంగా ఏడు నెలలపాటు ఆమె కేసుపై విచారణ జరిగింది.
అయితే, ఆమె విడుదలపై నేడు క్యూబా ఏజెంట్లలో పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చని ల్యాప్ భావిస్తున్నారు.
''అమెరికా అధికారుల ఎదుట ఆమె అన్ని వివరాలు వెల్లడించిన తర్వాత కూడా క్యూబా ఏజెంట్లలో ఆమెపై ఆసక్తి ఉంటుందని నేను అనుకోను. క్యూబాకు కూడా ఆమె చాలా నష్టంచేశారు. అందుకే వారు కూడా కోపంగానే ఉండొచ్చు’’ అని ఆయన వివరించారు.
ఇప్పుడు ఇటు అమెరికాలో, అటు క్యూబాలో ఎవరూ ఆమెను ''ద క్వీన్ ఆఫ్ క్యూబా’’గా భావించకపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- అస్సాం: 'మా ఇళ్లు కూల్చడానికి బదులు మమ్మల్ని చంపేయండి’
- రాహుల్ గాంధీ: 'మోదీ చేయనిది.. రాహుల్ చేశారు’ – భారత్ జోడో యాత్ర గురించి విదేశీ మీడియా ఎలా విశ్లేషిస్తోంది?
- జోషిమఠ్ 'కుంగిపోతోంది’ - కుప్పకూలిన ఆలయం.. ఇళ్లు వదిలి పోతున్న జనం.. ఈ హిమాలయ నగరంలో ఏం జరుగుతోంది?
- మైనర్ హిందూ బాలిక 'కిడ్నాప్, మతమార్పిడి, వివాహం’.. పాకిస్తాన్లో ఆందోళనలు
- హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజల కష్టాలేమిటి? మునిసిపాలిటీ పరిధిలోకి వస్తే ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)