Quota Row: మోడీ కేబినెట్లో రిజర్వేషన్ల చిచ్చు..! మంత్రుల రాజీనామా సవాళ్లు..!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( యూజీసీ) విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష రూపుమాపేందుకు తీసుకొచ్చిన కొత్త నిబంధనలు దేశంలో రిజర్వేషన్ల తేనెతుట్టెను మళ్లీ కదిపాయి. ఇప్పటికే యూనివర్శిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రక్షణలను బీసీలకు సైతం వర్తింపజేస్తూ యూజీసీ తెచ్చిన రూల్స్ ను అగ్రవర్ణాలు వ్యతిరేకించడం ప్రారంభించాయి. ఇది కాస్తా రిజర్వేషన్ హఠావో ఆందోళన్ పేరుతో అగ్రవర్ణాలు నిరసనలు చేసే వరకూ వెళ్లింది. వీటి వెనుక కేంద్రం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆందోళనకారులతో చర్చలు జరిపిన కేంద్రమంత్రి నడ్డా.. వారికి కీలక హామీలు కూడా ఇచ్చారు. అయినా రిజర్వేషన్ల వివాదం కొనసాగుతోంది.
అయితే ఈ రిజర్వేషన్ల వివాదం (Quota Dispute) ఇప్పుడు కేంద్ర కేబినెట్లో (Union Cabinet) సైతం చిచ్చు రేపుతోంది. తాజా ఆందోళనల నేపథ్యంలో రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని ఎన్డీయే భాగస్వామిగా ఉన్న హెచ్ఏఎం (సెక్యులర్) తాజాగా కోరింది. దీనిపై మండిపడుతున్న మరో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) తన సహచరుడు, హెచ్ఏఎం నేత జీతన్ రామ్ మాంఝీ (Jitan Manjhi) రాజీనామాను కోరారు. దీంతో ఎన్డీఏలో చీలిక ఏర్పడిందనే ప్రచారం సాగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో, రాజకీయాల్లోనూ తిరిగి రిజర్వేషన్ల చర్చ మొదలైందన్న ప్రచారానికి ఇది ఊతమిచ్చేలా ఉంది.

మాంఝీకి చెందిన హెచ్ఏఎం పార్టీ.. ప్రస్తుత రిజర్వేషన్ల వ్యవస్థలోనే ఎస్సీ, ఎస్టీలకు ఉప-కోటాలను సమర్థించడంతో.. బీహార్కు చెందిన చిరాగ్ పాస్వాన్, మాంజీ మధ్య వాగ్వాదం చెలరేగింది. అత్యంత బలహీన, చారిత్రాత్మకంగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ప్రయోజనాలు అందేలా చూడటానికి సమీక్ష అవసరమని మాంఝీ కుమారుడు, బీహార్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ అన్నారు.తాము రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి మాట్లాడటం లేదని, రిజర్వేషన్లను మరింత న్యాయబద్ధంగా, సమర్థవంతంగా మార్చడం గురించి, అణగారిన వర్గాలకు అవి వాస్తవంగా చేరేలా చూడటం గురించి మాట్లాడుతున్నామంటూ సుమన్ క్లారిటీ ఇచ్చారు. అయినా చిరాగ్ పాశ్వాన్ ఆగ్రహం చల్లారలేదు. దీంతో ఇవాళ ఆయన మాంఝీని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.














Click it and Unblock the Notifications