వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
న్యూఢిల్లీ: అత్యాధునిక రాఫెల్ యుద్ద విమానాలు గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోన్నాయి. ఈ వేడుకల్లో తన సత్తా చాటబోతోన్నాయి. వెర్టికల్ ఛార్లీ రాఫెల్ జెట్ ఫైటర్ రిపబ్లిక్ డే వైమానిక విన్యాసాల్లో భాగం కాబోతోంది. మహిళా పైలెట్ భావనా కాంత్ యుద్ధ విమాన విన్యాసాల్లో పాల్గొననున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి గణతంత్ర దినోత్సవానికి పరిమితంగా ఆహ్వానితులు హాజరు కానున్నారు. 25 వేల మందికే అవకాశం కల్పించారు. గత ఏడాది లక్షన్నర మంది ఇందులో పాల్గొనగా.. ఈ సారి ఆ సంఖ్య మూడింతల మేర తగ్గింది.
పోటెత్తుతోన్న ట్రాక్టర్లు: ఢిల్లీ చుట్టూ.. మూడు మార్గాల్లోనే: కనీవినీ ఎరుగని భద్రత
ఈ విన్యాసాల్లో వైమానిక దళానికి చెందిన 38 యుద్ధ విమానాలు, ఇండియన్ ఆర్మీకి చెందిన నాలుగు విమానాలు, సంవిజయ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ గల టీ-90 ట్యాంకులు, సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్లు భాగస్వామ్యం కానున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేసుకున్నాయి. రాజస్థాన్లోని జోధ్పూర్లో తన సత్తాను చాటి చెప్పాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఫ్రాన్స్ డిజర్ట్ నైట్-21 పేరిట జాయింట్ ఎక్సర్సైజ్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైమానిక దళం, పదాతదళాలకు చెందిన హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొననున్నాయి. రుద్ర, సుదర్శన్, రక్షక్, ఏకలవ్య, బ్రహ్మాస్త్ర, గరుడ వంటి హెలికాప్టర్ల ద్వారా దేశ రక్షణ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందనేది తేటతెల్లమౌతుందని అధికారులు తెలిపారు. అత్యాధునికమైన అపాచీ హెలికాప్టర్, కార్గో హెలికాప్టర్ చినూక్ల విన్యాసాలను చూడొచ్చని అన్నారు. గణతంత్ర దినోత్సవంలో చినూక్, అపాచీ హెలికాప్టర్లను గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు ఉపయోగించడం ఇదే తొలిసారి అవుతుంది. నౌకాదళం తరఫున ఐఎన్ఎస్ విక్రాంత్ శకటాన్ని పరేడ్లో ప్రదర్శించనున్నారు. అలాగే 1971లో భారత్-పాక్ యుద్ధానికి గుర్తుగా ఈ శకటాన్ని రూపందించారు.
ఐఏఎఫ్ వింటేజ్ డకోటా యుద్దవిమానం రెండు ఎమ్ఐ-17 హెలికాప్టర్లతో కలిసి రుద్ర ఫార్మేషన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముందు కవాతులో పాల్గొంటాయి. మొత్తంగా ఈ పెరేడ్లో 42 ఐఏఎఫ్ విమానాలు, నాలుగు ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లు భాగం కానున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్పథ్ గుండా ఇండియా గేట్ వరకు సాగుతుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు.