స్పీకర్ ఓం బిర్లాతో రఘురామ కృష్ణరాజు భేటీ.. అరెస్ట్, తదితర అంశాలపై చర్చ
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని.. సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ వచ్చిన వెంటనే హస్తిన చేరుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్.. ఇతర పెద్దలను కలుస్తున్నారు. సీఎం జగన్పై వరసగా ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. తాజాగా స్పీకర్ ఓం బిర్లాతో రఘురామ కృష్ణ రాజు సమావేశం అయ్యారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో ఎంపీ రఘురామ రాజు భేటీ అయ్యారు. తనను అరెస్ట్ చేయడం, తదనంతర పరిణామాలను స్పీకర్కు పూసగుచ్చినట్టు వివరించారు. సభా హక్కుల ఉల్లంఘన కింద సీబీసీఐడీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. ఏపీ పోలీసులపై కూడా రఘురామ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రఘురామ కృష్ణరాజు ఓ లేఖను ఓం బిర్లాకు అందజేశారు. గతంలో కూడా స్పీకర్ ఓం బిర్లాను రఘురామ కుటుంబీకులు కలిశారు.
వైసీపీ ప్రభుత్వం, జగన్ లక్ష్యంగా రఘురామ విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో భద్రత పెంచాలని స్పీకర్ను కోరగా.. హోంశాఖకు సిఫారసు చేశారు. దీంతో వై క్యాటగిరీ భద్రతను పొందుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఏపీ సీఐడీ ప్రత్యక్షం అయ్యారు. రఘురామ గురించి పక్కా సమాచారంతో వచ్చారు. అరెస్ట్ చేయడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల అంశం కూడా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గుంటూరు వైద్యులు, కమిటీ.. తర్వాత ఆర్మీ ఆస్పత్రి వైద్యులు పరీక్ష చేశారు.