నేను దెయ్యం, రాజన్ దేవదూతనా ? స్వామి
న్యూఢిల్లీ: బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామికి మళ్లీ కోపం వచ్చింది. ఆయన మరో సారి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై విమర్శల వర్షం కురిపించారు. ద్రవ్య పరపతి పాలసీ విషయంలో రఘురాం రాజన్ మీద ఆయన మండిపడ్డారు.
ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మీద సుబ్రమణ్య స్వామి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ కొట్టిపారేశారు. ఈ దెబ్బతో గత నెల రోజుల నుంచి సుబ్రమణ్య స్వామి మౌనంగా ఉన్నారు.
ఇప్పుడు ఆయన రాజన్ మీద మాటలతూటాలు పేల్చేచారు. మీడియా తనను రాక్షసుడిగా చిత్రిస్తున్నదని విషాదం వ్యక్తం చేశారు. అదే రఘురాం రాజన్ ను దేవదూతగా మీడియా చిత్రిస్తున్నదని సుబ్రమణ్య స్వామి మండిపడ్డారు.
రఘురాం రాజన్ విషయంలో ఆయనకు దేశం మద్దతు తెలిపే విధంగా బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాజన్ వెళ్లిపోతే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నిజానికి రాజన్ వెళ్లిపోతే స్టాక్ మార్కెట్లు పైకిలేస్తాయని సుబ్రమణ్య స్వామి జోస్యం చెప్పారు. వడ్డీ రేట్లు పెంచడం వలన రాజన్ దేశానికి చేటు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఉంటే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం అసాధ్యం అని సుబ్రమణ్య స్వామి అన్నారు.
నిత్యం ఏదో ఒక విషయంలో పలువురి పై ఆరోపణలు చేసే సుబ్రమణ్య స్వామి ఈ సారి ఒక నెల రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు ఆర్ బీఐ గవర్నర్ రఘురాం మీద మరో సారి మాటల తూటాలు పేల్చారు. స్వామి ఆరోపణలపై బీజేపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అని వేచిచూడాలి.