కర్ణాటక పీఠం గెల్చుకునేందుకు ఘర్షణలే బీజేపీ వ్యూహం.. సాధారణ సమస్యలు గాలికి
బెంగళూరు: మరో మూడు నెలల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో మూడు కీలక అంశాలు ముఖ్యంగా మారాయి. ఒకటి సీఎం సిద్ధరామయ్య.. రెండోది బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప.. ఆ పై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవెగౌడ కీలకంగా వ్యవహరించనున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు బీజేపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. కర్ణాటకలో అధికారాన్ని కాపాడుకోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. పంజాబ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కర్ణాటకలోనే కావడం గమనార్హం.
Recommended Video
అలాగే ప్రధాని మోదీ సారథ్యంలో కర్ణాటకలో బీజేపీ గెలుపొందడం ఆయనకు చాలా ముఖ్యం. ఇప్పటి వరకు వింద్య పర్వతాల ప్రాంతంలోని ఉత్తర భారత రాష్ట్రాల్లో వరుసగా బీజేపీని అధికారంలోకి తీసుకొస్తున్న మోదీ హవాకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఒక పరీక్ష కానున్నాయి. ప్రాంతీయంగా సెక్యులర్ జనతాదళ్ అధినేత, మాజీ ప్రధాని కూడా హెచ్ డీ దేవెగూడ కర్ణాటకలో కీలకమే. కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు ఆయనకు మరో అవకాశం ఉన్నది. తద్వారా కేంద్రంలో లాబీయింగ్ జరిపే వెసులుబాటు ఉంది.
మత కలహాల సాకుతో విస్తరణకు బీజేపీ యత్నాలు
ఈ క్రమంలో ఇటీవల మంగళూరులో జరిగిన మత కలహాల సాకుతో పార్టీని విజయ తీరాలకు నడిపించేందుకు కమలనాథులు వ్యూహం రచించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ముస్లిం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలు ఒక బీజేపీ కార్యకర్తను చంపేస్తే తలెత్తిన ఘర్షణలు మంగళూరు నగరం అంతటా విస్తరించాయి. 1990వ దశకం ప్రారంభం నుంచి మంగళూరులో మత ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మోరల్ పోలీసింగ్, చర్చిలపై దాడులు, హిందూ ముస్లింల మధ్య ఘర్షణలతో ప్రజల్లో పట్టు సంపాదించుకోవాలని కమలనాథులు తలపోస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్డీపీఐ అనుబంధ పీఎఫ్ఐ వంటి అతివాద ముస్లిం సంస్థలు, హిందుత్వ సంస్థల మధ్య ఘర్షణ పరిస్థితి దిగజారడానికి కారణమైంది.
బీజేపీ అధికారం ఆశలపై కాంగ్రెస్ పార్టీ ఇలా
ఐదేళ్ల క్రితం సిద్దరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కానీ కాంగ్రెస్ మాత్రం మత ఘర్షణలతో అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటోందని విమర్శిస్తోంది. గత బుధవారం జరిగిన ఘటన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య ముఖాముఖీ ఘర్షణకు సంకేతంగా నిలిచింది. ఎన్నికలు జరిగే నాటికి మత కలహాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
మంగళూరు జిల్లా ఇన్ చార్జీ మంత్రి రామనాథ రాయ్ను తొలగించాలని డిమాండ్
బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప స్పందిస్తూ తమ పార్టీ కార్యకర్తల మరణానికి సిద్దరామయ్య ప్రభుత్వమే కారణమని ప్రత్యక్ష దాడికి దిగారు. ‘సిద్దరామయ్య బుజ్జగింపు రాజకీయాల వల్లే మా పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. దీనికి ప్రభుత్వానిదే బాధ్యత. తక్షణం మంగుళూరు జిల్లా ఇన్చార్జీ మంత్రి బీ రామనాథ రాయ్ని తొలగించాలి. ఆయన అతివాద శక్తులను రక్షిస్తూ ప్రోత్సహిస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు' అని యెడ్యూరప్ప హెచ్చరించారు.
పరిస్థితి చక్కదిద్దేందుకు సిద్ధరామయ్య ఇలా
కేంద్ర నైపుణ్యాభివ్రుద్ధిశాఖ సహాయ మంత్రి అనంతకుమార్ హెగ్డే.. కర్ణాటకలో హిందుత్వ రాజకీయాలకు కేంద్రంగా ఉన్నారు. హిందుత్వ సంస్థలకు వ్యతిరేకంగా సిద్దరామయ్య ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ట్వీట్లు, వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శ ఉంది. సిద్దరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం పార్లమెంట్ బయట బీజేపీ ఎంపీలు నిరసన ప్రదర్శనలు చేశారు. ముగింపులేని మతపరమైన హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం తన క్యాబినెట్ మంత్రి.. మంగళూరు ఎమ్మెల్యే యూటీ ఖాదర్ను పిలిపించి మందలించారు. హోంమంత్రి ఆర్ రామ లింగారెడ్డితో సవివరంగా సంప్రదింపులు జరిపారు. తక్షణం మత కలహాల మంటలు ఆర్పేయాలని ఆదేశించారు.
కరాండ్లాజేకు పీఎఫ్ఐతోనే రాజకీయ అనుబంధం ఉన్నదని ఎదురుదాడి
ఈ సందర్భంగా హోంమంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ ‘బీజేపీ అత్యంత బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తోంది. వారు ఓట్లు పొందడానికి మత పరమైన ఉద్రిక్తతలను ఉపయోగించుకుంటున్నారు. మా ప్రభుత్వం ఏ ఒక్కరినీ రక్షించదు. మత, రాజకీయాలకతీతంగా ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే హంతకులను అరెస్ట్ చేశాం' తేల్చి చెప్పారు. బీజేపీ ఎంపీ శోభా కరాండ్లాజేకు మంగళూరు జిల్లా పుత్తూరు సమీపాన గల ఆమె సొంత ప్రాంతంలో పీఎఫ్ఐ వంటి సంస్థలతో రాజకీయ అనుబంధం ఉన్నదని హోంమంత్రి రామలింగారెడ్డి ఆరోపించారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐలతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధాల్లేవని తేల్చి చెప్పారు.
దోషులైతే పోలీసుల చర్యలకు ఎవరూ అడ్డుపడబోరని మంత్రి ఖాదర్ స్పష్టీకరణ
మంగళూరులో స్థానిక వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లకు దిగిన యువజన కాంగ్రెస్ నాయకుడితో కలిసి భోజనం చేస్తున్న మంత్రి యూటీ ఖాదర్ తదితరులతో కూడిన ఫొటోను బీజేపీ నేతలు విడుదల చేసింది. ఇదే గ్రూపునకు అదే ముస్లిం గ్రూపులతో సంబంధం ఉందని ఆరోపణలకు దిగారు. కానీ మంత్రి ఖాదర్ ఈ ఆరోపణలను కొట్టి పారేశారు. తనకు ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఒక పంక్షన్లో తనతో కలిసి మాత్రమే కూర్చున్నాడని ఖాదర్ చెప్పారు. తాను అతడ్ని ఆహ్వానించలేదని అన్నారు. ఆయన ఒక లోకల్ నేరగాడని ఆరోపించారు. ఒకవేళ అతడు హత్యకు పాల్పడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, వారిని ఎవరూ అడ్డుకోబోరని మంత్రి ఖాదర్ తేల్చి చెప్పారు.
సాదారణ సమస్యలు దారి తప్పుతాయని ఆందోళన
నెలరోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులు, ముస్లిం అతివాద సంస్థల మధ్య ఘర్షణలే ప్రచారాస్త్రంగా మారతాయని ప్రత్యేకించి కోస్తా తీరంతోపాటు మల్నాద్ ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ కొన్ని కన్నడ అనుకూల సంస్థలు, వేదికలు మాత్రం ప్రస్తుత పరిస్థితుల గురించి ఆందోళన చెందుతున్నాయి. మత ఘర్షణల ఏజెండా ఎన్నికల ప్రచారాన్ని హైజాక్ చేసి నిజమైన సమస్యలను తప్పుదోవ పట్టిస్తాయని అంటున్నారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వాటా, నీటి పారుదల, మౌలిక వసతులు, బయట వ్యక్తుల వలస, అవినీతి తదితర అంశాలు సాధారణంగా చర్చకు వస్తుందని చెప్తున్నారు.
యెడ్యూరప్ప హామీకి భిన్నంగా పరిస్థితులు
ప్రధాన మీడియా తప్పిదాలకు పాల్పడుతుందని కన్నడ అనుకూల సంస్థలు చెప్తున్నాయి. కర్ణాటక అంతటా మత ఘర్షణలు జరుగుతున్నాయన్న భ్రమల్లో మీడియా సంస్థలు ఉన్నాయని అంటున్నాయి. కానీ మంగళూరు పరిసర ప్రాంతాల్లో మాత్రమే మత ఘర్షణలు జరుగుతున్నాయని కన్నడ అనుకూల సంస్థలు, వేదికలు అంటున్నాయి. బీజేపీ కేవలం మత పరమైన ఎజెండాతోనే పని చేస్తున్నదని ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీలేవీ ప్రజల నిజమైన సమస్యలు పట్టించుకోవని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇటువంటి తేలికపాటి అంశాలను ముందుకు తెస్తాయని అంటున్నాయి. గమ్మత్తేమిటంటే బీజేపీ సీఎం అభ్యర్థి యెడ్యూరప్ప మాత్రం ప్రగతి నినాదంతోనే ఎన్నికల ప్రచారం సాగుతున్నా..పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.