లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియా కూటమి ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో మంగళవారం సాయంత్రం ఇండి కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్నారరు.
ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధిష్టానం ఇప్పటికే రాహుల్ ను లోక్సభ ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసినప్పటికీ.. ఆయన తన నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచారు. తాజాగా, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్ ముందుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్ కు సీపీపీ నేత సోనియా గాంధీ లేఖ ద్వారా తెలియజేశారు.

కాగా, బుధవారం 18వ లోక్సభకు సంబంధించి స్పీకర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమినంతా ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ స్వీకరించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీలో నాయకుల అభిప్రాయం మేరకు తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రొటెం స్పీకర్కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నేత సోనియా గాంధీ లేఖ ద్వారా ఆయన సమచారం పంపారు.
దీంతో గత పదేళ్ల కాలంలో తొలిసారిగా లోక్సభలో ప్రతిపక్షనేత ఉన్నట్లయ్యింది. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయనాడ్ నుంచి కూడా గెలుపొందినప్పటికీ.. ఇటీవల ఆ స్థానానికి రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.
మరోవైపు డిప్యూటీ స్పీకర్ పొజిషన్ను ప్రతిపక్షానికి కేటాయించాలన్న డిమాండ్కు అధికార ఎన్డీఏ సానుకూలంగా స్పందించకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షం తరఫున కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కె. సురేశ్ను బరిలోకి దించింది. దీంతో బుధవారం ఉదయం స్పీకర్ ఎన్నిక నిర్వహించే అవకాశముంది.












Click it and Unblock the Notifications