Rahul Gandhi : సుప్రీం తలుపుతట్టిన రాహుల్ గాంధీ ! ఇదే ఆఖరి ఛాన్స్ ?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై గుజరాత్ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో ఆయన ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సూరత్ కోర్టు విధించిన జైలుశిక్షను నిలిపేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. దీనిపై వచ్చేవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది. ఈ విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రాహుల్ గాంధీ భవితవ్యాన్ని కచ్చితంగా నిర్ణయించబోతోంది.
2019 ఎన్నికల సమయంలో మోడీ ఇంటిపేరున్న వారంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు మూడేళ్ల తర్వాత ఈ ఏడాది రాహుల్ కు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అనంతరం ఆయన ఈ తీర్పుపై స్టే కోరుతూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది.

అంతే కాదు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రచ్ఛక్.. తన తీర్పులో రాహుల్ పై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాహుల్ చేసిన నేరం నైతిక పరమైన ప్రవర్తన కిందకు వస్తుందని, రాజకీయాల్లో నేతలు స్వచ్ఛంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాహుల్ కు విధించిన జైలుశిక్షపై స్టే ఇవ్వడానికి తగిన కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేశారు. దీంతో ఇప్పుడు రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాహుల్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపిన తర్వాత సూరత్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తే అనూహ్య పరిణామాలు తలెత్తబోతున్నాయి. ఆయన కచ్చితంగా జైలుకెళ్లాల్సిన పరిస్దితి నెలకొంటుంది. అంతే కాదు ఆయనకు 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కూడా లేకుండా పోతుంది. దీంతో సుప్రీంకోర్టు రాహుల్ పిటిషన్ పై ఇచ్చే తీర్పు చాలా కీలకంగా మారిపోయింది. మరో విధంగా చెప్పాలంటే ఈ తీర్పు దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఇప్పటికే విపక్షం తరఫున రాహుల్ ప్రధాని అభ్యర్ధిగా నిలిపేందుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో సుప్రీం ఇచ్చే తీర్పుపై అందరి దృష్టీ ఉండబోతోంది.












Click it and Unblock the Notifications