వారు తలుచుకుంటే ఎవరినైనా గెలిపిస్తారు: రాహుల్ గాంధీ
సోషల్ మీడియా సంస్థలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పార్టీల విజయాన్ని అవి నిర్ణయిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతోంది. వాసిం జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడారు.
భారత దేశంలో జరిగే ఎన్నికలను సోషల్ మీడియా ద్వారా రిగ్గింగ్ చేయవచ్చని రాహుల్ అన్నారు. ఈవీఎంలు సురక్షితంగా ఉన్నప్పటికీ చేయవచ్చన్నారు. ఏ పార్టీనైనా ఎన్నికల్లో సోషల్ మీడియా సంస్థలు కోరుకుంటే గెలిపిస్తాయని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒక క్రమపద్ధతిలో పక్షపాతవైఖరిని అనుసరిస్తున్నారని, అందుకు తన సోషల్ మీడియా ఖాతాలే నిదర్శనం అన్నారు. సమాజంలో అసమానతలకు మతఘర్షణలను ఒక వ్యూహాత్మకమైన ఆయుధంగా ఒక సిద్ధాంతానికి చెందిన నేతలు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అలాగే మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. ఇక్కడి అధికార పక్షం ఏ పార్టీకి చెందినదో అంతుబట్టడం లేదని, చాలా చిత్రమైన పరిస్థితి అన్నారు.
అనంతరం వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్కు ఆయనో చిహ్నమని, బ్రిటీషర్ల నుంచి పింఛన్ తీసుకుంటూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేశారని వెల్లడించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.