మాకు సంబంధంలేదు: సిక్కు వ్యతిరేక అల్లర్లపై రాహుల్ కొత్త పాట, ధీటుగా బీజేపీ
న్యూఢిల్లీ: 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. బ్రిటన్లో పర్యటిస్తున్న ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో, లండన్లో పార్లమెంటేరియన్లు, స్థానిక నేతలతో మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. అంతేకాదు దీనికి కారకులైన వారిని శిక్షించాలన్నారు.
దీని కారకులను శిక్షించాలనే అంశంలో తాను వంద శాతం మద్దతిస్తానని రాహుల్ చెప్పారు. ఆ రోజు తప్పులు చేసిన వారిని శిక్షించాలన్నది తన ఉద్దేశమని, ఆ అల్లర్లు ఎంతో విషాధకరమైనవన్నారు. అది బాధాకరమైన అనుభవం అన్నారు. అదే సమయంలో ఆయన మరో వ్యాఖ్య కూడా చేశారు.
ఆ సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్కు పాత్ర ఉందన్న వాదనతో తాను ఏకీభవించనని చెప్పారు. ఈ సిక్కు వ్యతిరేక అల్లర్ల కారణంగా వేలాది మంది సిక్కులు చనిపోయారు. దీనికి కాంగ్రెస్ పార్టీయే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కానీ రాహుల్ దానిని కాదని కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదని చెప్పడం గమనార్హం.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో భారతీయ విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. అక్కడా సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావించారు. తానూ హింసకు బాధితుడినేననీ, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. తన తండ్రి హత్య గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
జీవితంలో ఎన్నడూ హింసను ఎదుర్కోనివారు అది సినిమాల్లో చూపే విధంగా ఉంటుందనుకుంటారని, నిజానికి అది అలా ఉండదని, తాను అమితంగా ఇష్టపడేవారు హత్యకు గురికావడాన్ని చూశానని, తన తండ్రి హత్యకు కారణమైన ఎల్టీటీఈ ప్రభాకరన్ మృతదేహాన్ని చూసినప్పుడు అతనిపై తనకు జాలి కలిగిందని, మీరు హింసకు బాధితులైనప్పుడు, దాని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అది మీపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ఇది కొత్త వివాదానికి దారి తీసింది.
ఘాటుగా స్పందించిన బీజేపీ
సిక్కు వ్యతిరేక అల్లర్లపై 33 ఏళ్ల తర్వాత రాహుల్ తేనెతుట్టె కదపడంతో బీజేపీకి మంచి అవకాశం దొరికింది. దీనిపై బీజేపీ నేత సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ 2013లో క్షమాపణ చెప్పిందని చెప్పారు. 1984 సిక్కు అల్లర్ల విషయంలో 2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పిన విషయాన్ని తాను రాహుల్కు గుర్తు చేస్తున్నానని సంబీత్ పాత్రా అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై అకాలీ దళ్ నేత బిక్రమ్ సింగ్ మజితియా తీవ్రంగా స్పందించారు. రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. ఒక మహావృక్షం కూలినప్పుడు భూమి కంపిస్తుందని ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. సిక్కుల ఊచకోతకు వారే కారణమని, దీనిపై రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు.