రాహుల్ గాంధీకి గణతంత్ర వేడుకల ఆహ్వానం... నాలుగో వరుసలో సీటు, మండిపడిన కాంగ్రెస్
గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ప్రభుత్వ తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది.
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ప్రభుత్వ తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపిన వివరాల ప్రకారం... రాహుల్ గాంధీకి సీటు కేటాయింపులో ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదని తెలుస్తోంది.
''గణతంత్ర దినోత్సవాల కవాతు సందర్భంగా రాహుల్ గాంధీకి నాలుగో వరుసలో సీటు కేటాయించారని తెలిసింది. గతంలో మొదటి వరుసలో సీటును ఆయనకు కేటాయించేవారు..'' అని ఆ నేత తెలిపారు.
ఈ విధంగా వ్యవహరిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉన్నప్పటికీ, గణతంత్ర దినోత్సవ కవాతుకు రాహుల్ గాంధీ హాజరవుతారని తెలుస్తోంది.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలకు 10 ఆసియాన్ దేశాల అధినేతలు కూడా హాజరవుతున్నారు. థాయ్లాండ్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, సింగపూర్, మయన్మార్, కాంబోడియా, లావోస్, బ్రూనే దేశాధినేతలను భారతదేశం ఆహ్వానించింది.