రాహుల్..తప్పుటడుగు?
Rahul Gandhi: కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సమకాలీన జాతీయ రాజకీయాలు, పరిపాలనపై ఉన్నపట్టు, అవగాహనపై తరచూ అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతోంటాయి. దీనికి కారణాలు లేకపోలేదు. ఆయన నోటి వెంట తరచూ వెలువడే వివాదాస్పద ప్రకటనలు, వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అది నిజమేననిపిస్తుంది. రాహుల్ చేసిన వ్యాఖ్యలను చాలాసార్లు అమాయకమైనవిగా పరిగణనలోకి తీసుకున్న పరిస్థితులు కూడా లేకపోలేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువు అయింది.

స్వదేశానికి వ్యతిరేకంగా పోరాడాడుతున్నానంటూ తాజాగా రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలు తేనెతుట్టెను కదిపినట్టయింది. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, భారత్కు వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ ఆయన రెండు రోజుల కిందటే బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన పోరాటం రాజకీయాలపై కాదని, సైద్ధాంతిక విధానాలపైనేనంటూ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు- మావోయిస్టుల భావజాలానికి అద్దం పట్టినట్టయిందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. వీటిని- ప్రమాద ఘంటికలు అభివర్ణిస్తోన్నారు విశ్లేషకులు. ఈ ప్రకటన దేశ సమగ్రత, సార్వభౌమత్వం పట్ల ఆయనలో ఉన్న తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది.
ఈ వ్యాఖ్యలు అనాలోచితంగా చేసినవి కాదు. ఉద్దేశపూరకంగానే రాహుల్ మాట్లాడారని, ఇదొక వ్యూహంగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ తన అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నట్టయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాహుల్ గాంధీ దేశ సమైక్యతను ప్రశ్నించడం ఇది మొదటిసారేమీ కాదు. భారత్ ఒక దేశం కాదని, రాష్ట్రాల సమాఖ్య మాత్రమేనంటూ గతంలో చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రకటనలు జాతీయవాద పునాదులను బలహీనపరుస్తాయనడంలో సందేహాలు అక్కర్లేదని చెబుతున్నారు విశ్లేషకులు.
ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ సమైక్యత పట్ల తనకు నమ్మకం లేదన్న అభిప్రాయాన్ని మరింత బలపరుస్తోన్నాయి. దేశానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రకటించడం ద్వారా రాహు గాంధీ పరోక్షంగా జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, రాజ్యాంగాన్ని లక్ష్యాన్ని కించపరిచినట్టయిందని చెబుతున్నారు.
ఇలాంటి నిర్లక్ష్యపు వ్యాఖ్యానాలు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను సవాలు మారుతాయని, అది సమాజంలో చీలికలకు దారి తీస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. లోక్సభ మొదలుకుని సుప్రీంకోర్టు వరకు ప్రతి రాజ్యాంగ వ్యవస్థను, ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తాడని అంటున్నారు.
యూపీఏ హయాంలో కేబినెట్ ప్రతిపాదనలను రాహుల్ గాంధీ బహిరంగంగా చింపివేయడం, సున్నిత, సమస్యాత్మక సందర్భాల్లో చైనా అధికారులతో సమావేశం కావడం, విదేశీ సంస్థలతో వివాదాస్పదమైన, లోపాయకారి ఒప్పందాలను కుదుర్చుకున్నాడనే అనుమానాలకు మరింత బలాన్ని ఇచ్చేవే.
సీఐఏతో సంబంధాలు ఉన్న సోమాలి-అమెరికన్ పొలిటీషియన్ ఇల్హాన్ ఒమర్ వంటి వాళ్లతో కలిసి భారత్కు వ్యతిరేకంగా గళం వినిపించాడనే ఆరోపణలు ఇప్పటికే రాహుల్ గాంధీపై ఉన్నాయి. దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే సంస్థలతో సత్సంబంధాలను పెట్టుకున్నాడనడానికి వీటిని సాక్ష్యాలుగా చూపిస్తోన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రత్యక్షంగా సవాలు విసురుతున్నట్టే. సమాజంలో విభజనను సృష్టించడం, దేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించే ప్రమాదం లేకపోలేదు.
దేశానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ తక్షణమే వివరణ ఇవ్వాలని, తన కుటుంబానికి అత్యున్నత పదవులను ఇచ్చి గౌరవించిన దేశం పట్ల శత్రుత్వం పెంచుకోవడం ఏమిటీ? దానికి ఆజ్యం పోసేలా మాట్లాడటం ఏమిటి? రాహుల్ ప్రకటనలు విభజనకు దారి తీస్తాయని, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలపై అవిశ్వాసానికి బీజాలు వేస్తాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications