రాహుల్, ప్రియాంకను రానివ్వకుండా..ఈ రేంజ్ సెక్యూరిటీ
Rahul Gandhi and Priyanka Gandhi Vadra: దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉత్తర ప్రదేశ్లోని సంభాల్ను సందర్శించడానికి, బాధితులను పరామర్శించడానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సంభాల్ వెళ్లడానికి ప్రయత్నించడం దీనికి కారణం.
మొన్నటివరకు అల్లర్లు, హింసాత్మక పరస్థితులతో అట్టుడికింది సంభాల్. అక్కడి షాహి జామా మసీదులో సర్వే నిర్వహించడానికి న్యాయస్థానం ఆదేశించడం దీనికి కారణమైంది. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర గల మసీదు ఇది. అంతకుముందు ఇక్కడ శ్రీహరి ఆలయం ఉండేదని, మొఘలుల కాలంలో దాన్ని కూలగొట్టి మసీదును నిర్మించారంటూ పిటీషన్లు దాఖలైన నేపథ్యంలో కోర్టు సర్వే నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది.

తొలి సర్వే శాంతియుతంగా కొనసాగినప్పటికీ.. రెండో విడతలో మాత్రం హింస చెలరేగింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్వే చేపట్టడానికి కిందటి నెల 24వ తేదీన పురావస్తు శాఖ అధికారుల బృందం సంభాల్కు రావడంతో చెలరేగిన అల్లర్లు.. రోజుల తరబడి సాగాయి. అక్కడ చెలరేగిన ఘర్షణల్లో అయిదుమంది మరణించారు. పలువురు గాయపడ్డారు. సుదీర్ఘకాలం పాటు కర్ఫ్యూ కొనసాగింది. ఇప్పటికీ అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంటోంది.
ఈ అల్లర్లల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఈ ఉదయం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు, ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బయలుదేరారు. ఈ మధ్యాహ్నానికి వారంతా సంభాల్కు చేరుకోవాల్సి ఉంది.
మార్గమధ్యలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద జాతీయ రహదారిపై బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు. కార్లల్లో ర్యాలీగా తరలిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు కదలకుండా వందల సంఖ్యలో పోలీసులను మోహరింపజేసింది ప్రభుత్వం.
ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. సంభాల్లో 144 క్రిమినల్ ప్రొసీజర్ అమలులో ఉందని, ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళితే ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే ప్రమాదం ఉందని పోలీసులు వారికి సూచించారు. సంభాల్ ప్రయాణం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని వాళ్లు పట్టించుకోలేదు.
తమను అడ్డుకున్న పోలీసులతో రాహుల్, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కారు డోర్పైకి ఎక్కడం కనిపించింది. ఎందుకు వెళ్లకూడదంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. తాము ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications