పోలీసు స్టేషన్లో రాహుల్, ప్రియాంక మెరుపు ధర్నా- పెల్లెట్ల ప్రయోగంపై FIRకు పట్టు..!
ఢిల్లీలో గత నెల 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్దులపై పోలీసులు చేసిన దాడుల్లో పెల్లెట్ గన్ లను ప్రయోగించారు. దీంతో పలువురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. అయితే వీటిపై ఇప్పటివరకూ పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో అలా పెల్లెట్ గన్ ఫైరింగ్ లో గాయపడిన ఓ విద్యార్ధిని తీసుకుని ఇవాళ లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై పోలీసుల్ని ప్రశ్నించారు. అయినా పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించారు.
దీంతో రాహుల్, ప్రియాంక, మరో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్ధీద్ తో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పోలీసులు పెల్లెట్ గన్ ల ప్రయోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేంతవరకూ కదిలేది లేదంటూ వీరు అక్కడే భైఠాయించారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల్ని సంప్రదించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ పెల్లెట్ గన్ ల ప్రయోగంపై విచారణ జరుపుతున్న నేపథ్యంలో తాము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నిబంధనలకు విరుద్దమని పోలీసులు కాంగ్రెస్ నేతలకు తెలిపారు. దీంతో సంతృప్తి చెందని రాహుల్, ప్రియాంక ధర్నా కొనసాగించారు.

మరోవైపు ఒత్తిడి అంతకంతకూ పెరుగుతుండటంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు ఫిర్యాదు దారు అయిన సాహిల్ నుంచి ఫిర్యాదు తీసుకుని ఆమోదించినట్లు ఓ ప్రకటన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్.. పెల్లెట్ గన్ ల ప్రయోగంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. పోలీసులు తాము పెల్లెట్ గన్ లు వాడలేదని చెప్పడంపై స్పందిస్తూ.. పోలీసులు కాకపోతే ఇంకెవరు వాడారని నిలదీశారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి ఎవరని రాహుల్ ప్రశ్నించారు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆదేశాలు ఉన్నట్లు పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్ పోలీసులు రాహుల్ గాంధీకి తెలిపారు. దీనిపై స్పందించిన రాహుల్.. అసలు ఈ కేసులో హోంమంత్రి అమిత్ షాను ఎందుకు బాధ్యుడిని చేయడం లేదని అడిగారు.













Click it and Unblock the Notifications