రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంట్రీకి ఆ స్థానమే ఎందుకు?
తిరువనంతపురం: వాయనాడ్. కేరళలో కొత్తగా పుట్టుకొచ్చిన లోక్ సభ స్థానంపై దేశవ్యాప్తంగా వాడివేడిగా చర్చ నడుస్తోంది. డిబేట్లకు తెర తీసింది. అందరి దృష్టినీ ఆకర్షించింది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ ఎన్నికల వ్యూహాన్ని, ప్రచార రణతంత్రాన్ని మార్చుకునేలా చేసింది. ప్రజల నోళ్లల్లో నానుతోంది. దీనికి కారణం- అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఈ లోక్ సభ ద్వారా దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో అడుగు పెట్టడమే.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీ నుంచి పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఏదైనా ఓ స్థానం నుంచి ఎన్నికల రేసులో నిల్చోవాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన విజ్ఙప్తికి తలూపారు రాహుల్. కేరళలోని వాయనాడ్ స్థానాన్ని ఎంచుకున్నారు. త్వరలో నామినేషన్ వేయబోతున్నారు.
ఒక కాలు ఉత్తరాదిన, మరో కాలు దక్షిణాదిన: రెండు స్థానాల్లో రాహుల్ పోటీ, కేరళ నుంచి లోక్ సభకు!
వాయనాడే ఎందుకు?
వాయనాడ్ ను ఎంచుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన తలపండిన సీనియర్ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వాయనాడ్.. భౌగోళికంగా తమిళనాడుకు ఆనకుని ఉంటుంది. కేరళలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాదులే ఉన్నప్పటికీ.. తమిళనాడులో మాత్రం నామమాత్రంగా కూడా లేదు. ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్ సభను ఎంచుకున్న ప్రభావం పొరుగునే ఉన్న తమిళనాడుపై సానుకూలంగా ఉంటుందని పార్టీ భావిస్తోంది. తమిళనాడులో పార్టీ జవసత్వాలు పుంజుకోవడానికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది.
కేరళలో వామపక్షాలే కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు..
కేరళలో కాంగ్రెస్ పార్టీకి మంచి పునాదులే ఉన్నాయి. యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఏర్పాటైన కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. సీపీఎం నేతృత్వంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూటమి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి. కేరళలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. బీజేపీ సహా మూడో పార్టీకి ఇక్కడ అవకాశమే లేదు. 2006, 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఊమెన్ చాందీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2016 ఎన్నికల్లో యూడీఎఫ్ పరాజయం పాలైంది. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేరళలో అధికారంలోకి వచ్చింది.
కేరళలో బీజేపీ బలపడుతుండటం వల్లే..
దశాబ్దాలుగా అధికార మార్పిడి అనేది ఈ రెండు కూటముల మధ్యే నడుస్తోంది. అలాంటి కేరళలో తన ఉనికిని చాటుకోవడానికి నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ తీసుకున్న కొన్ని చర్యల వల్ల ఇటీవలి కాలంలో కేరళలో ఆ పార్టీ బలపడుతోంది. కేరళకు చెందిన నాయకులకు అన్ని చోట్లా ప్రాధాన్యత ఇస్తోంది బీజేపీ అగ్ర నాయకత్వం. కేరళకు చెందిన పార్టీ నాయకులకు కీలక పదువులను అప్పగించింది. కేరళ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కుమ్మనమ్ రాజశేఖరన్ మొన్నటిదాకా మిజోరాం గవర్నర్ గా పనిచేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.
బీజేపీ నేతలకు కీలక పదవులు..
ప్రస్తుతం తిరువనతంపురం లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రముఖ నటుడు సురేష్ గోపీకి రాజ్యసభకు ఎంపిక చేసింది బీజేపీ. డబ్బింగ్ సినిమాల ద్వారా సురేష్ గోపి తెలుగు వారికీ చిర పరిచితుడే. కేరళలో పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రస్తుతం సురేష్ గోపి పర్యవేక్షిస్తున్నారు. అలాగే-మాజీ ఐఎఎస్ అధికారి అల్ఫొన్సో కన్నిన్ థనమ్ కు కేంద్రమంత్రి పదవిని అప్పగించారు నరేంద్రమోడీ. ఇవన్నీ పార్టీని బలోపేతం చేసే చర్యలే.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలోనూ కేరళలో బీజేపీ చురుగ్గా వ్యవహరించింది. కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వంటి విద్యార్థి సంఘాలు శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళనలను లేవదీశాయి. బంద్ లు నిర్వహించాయి. ఫలితంగా- హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకోగలిగాయని అంటున్నారు. దీన్ని అడ్డుకోవడానికి రాహుల్ గాంధీని కేరళ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది.
వాయనాడ్ పరిధిలో ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకు పదిలం..
కేరళలో మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి. వాటన్నింటితో పోల్చుకుంటే వాయనాడ్ కాస్త వెనుకబడిన జిల్లా. కొండ ప్రాంతం. తేయాకు తోటలు అధికం. ఈ జిల్లాల్లో ఉన్న జనాభాలో అధికశాతం మంది ముస్లింలు, క్రైస్తువులు. ప్రస్తుతానికి ఈ రెండు వర్గాల ఓటు బ్యాంకు పార్టీ వైపే మొగ్గు చూపుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. వాయనాడ్ లోక్ సభ పరిధిలో 49 శాతం హిందువులు ఉండగా.. మరో 49 శాతం ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకు ఉంది. 2009, 2014లో వాయనాడ్ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ పాగా వేసింది. ఆ పార్టీకి చెందిన షానవాజ్ విజయం సాధించారు. రెండుసార్లు కూడా షానవాజ్ విజయం సాధించడానికి ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకు ప్రధానంగా పనిచేసిందనేది కాంగ్రెస్ నాయకుల విశ్లేషణ.
వాయనాడ్ లో ఓటు బ్యాంకును భారీగా పెంచుకున్న బీజేపీ
2009 ఎన్నికల్లో వాయనాడ్ లోక్ సభ స్థతానంలో మొత్తం 11,02,097 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 4,10,703 ఓట్లు షానవాజ్ కు పడ్డాయి. సీపీఐ కూడా ముస్లిం అభ్యర్థినే నిలబెట్టినప్పటికీ..ఆశించిన ఫలితం రాలేదు. సీపీఐ అభ్యర్థి రహంతుల్లాకు 2,57,264 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీఆర్ రస్మిల్ నాథ్ కు 31,687 ఓట్లు మాత్రమే పడ్డాయి. 2014 నాటి ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. 2009లో 31, 687 ఓట్లు మాత్రమే బీజేపీకి రాగా.. 2014 నాటికి ఈ సంఖ్య 80 వేలకు చేరుకుంది. బీజేపీ అభ్యర్థి రస్మీల్ నాథ్ కు 2014 నాటి ఎన్నికల్లో 80, 752 ఓట్లు వచ్చాయి. వాయనాడ్ లోక్ సభ పరిధిలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా మెరుగుపడటం, అదే సమయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు క్షీణించడం మొదలు పెట్టింది. 2014 ఎన్నికల నాటి కాంగ్రెస్ షానవాజ్ కు 3,77,035 ఓట్లు పడ్డాయి. 2009తో పోల్చుకుంటే సుమారు 50 వేలకు పైగా ఓట్లను కాంగ్రెస్ పోగొట్టుకుంది. సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరికి 3,56,165 ఓట్లు పడ్డాయి. ఈ రెండింటి మధ్య ఉన్న మెజారిటీ రెండు శాతమే అధికం. అదే సమయంలో బీజేపీ ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. దీన్నంతటినీ బేరీజు వేసుకుని కాంగ్రెస్ పార్టీ ఏకంగా రాహుల్ గాంధీనే వాయనాడ్ బరిలో దింపింది. దీని ఫలితం- పొరుగునే ఉన్న తమిళనాడుపై పడుతుందని, పార్టీ పరిస్థితి మెరుగవుతుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.