బళ్లారిలో బీజేపీ, ఆరెస్సెస్ పై రాహుల్ మాటల దాడి-దేశంలో హింసకు వారి భావజాలమే కారణమంటూ..
బళ్లారి : బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే దేశంలో హింసను సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బళ్లారిలో నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని బళ్లారికి చేరుకున్న సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. దీనికి జనం కూడా భారీగా తరలివచ్చారు. ఈ సభలో బీజేపీ, ఆరెస్సెస్ పై రాహుల్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.
దేశంలో హింసకు బీజేపీ, ఆరెస్సెస్ భావజాలం కారణమవుతోందని రాహుల్ విమర్శించారు. వారు చేస్తున్నది జాతీయవాదం కాదని, జాతీయ వ్యతిరేకత అని రాహుల్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు 50 శాతం పెరిగాయని, నిరుద్యోగం, ధరల పెరుగుదల మధ్య సామాన్యులు,యువత నలిగిపోతున్నారని రాహుల్ ఆరోపించారు. 2004కు ముందు ప్రధాని మోడీ.. దేశంలో గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన చెందారని, అది తల్లులు, సోదరీమణులను ఎలా ప్రభావితం చేసిందనేది ఎవరూ మర్చిపోలేదన్నారు. ఇప్పుడు ఎల్పిజి సిలిండర్ ధరలు 400 నుండి 1050 రూపాయలకు పెరిగాయని, ఇప్పుడు వాళ్లు బాధపడుతున్నారో లేదో ఆయన ప్రశ్నించగలరా అని రాహుల్ నిలదీశారు.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. కర్నాటకలో బీజేపీది 40 శాతం సర్కార్ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో 40 శాతం కమీషన్ చెల్లించి ఏదైనా కొనుగోలు చేయవచ్చని రాహుల్ ఎద్దేవా చేశారు. కర్నాటకలో ఉద్యోగాలు అమ్ముకునే రిక్రూట్మెంట్ స్కామ్లు చాలా జరిగాయని, ఇటీవల జరిగిన పీఎస్ఐ, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కుంభకోణాలు ప్రభుత్వం డబ్బులకు ఉద్యోగాలను అమ్ముకుంటోందని రాహుల్ విమర్శించారు.
మరోవైపు రాహుల్ గాంధీ బళ్లారిలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ర్యాలీలో ఇవాళ 2 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.భారత్ జోడో యాత్రలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్, కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలువురు సీనియర్లు ఇవాళ పాల్గొన్నారు. దీంతో ఇవాళ భారత్ జోడో యాత్ర 38వ రోజుకు చేరుకుంది.