రాహుల్ గాంధీ, సోనియా ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్: ఎందుకంటే?
భోపాల్: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. బెంగళూరులో విపక్షాల భేటీ ముగించుకుని వారు ఢిల్లీకి బయల్దేరారు. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు భోపాల్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ మేరకు వివరాలను భోపాల్ పోలీసులు వెల్లడించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని సమర్థంగా ఎదుర్కొనేందుకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో 26 విపక్ష పార్టీలు రెండు రోజులపాటు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో సోనియా, రాహుల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో విపక్షాల కూటమికి భారతీయ జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి(I-N-D-I-A) నామకరణం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమావేశం అనంతరం వెల్లడించారు.

2024 ఎన్నికల్లో ఇండియా, ఎన్డీఏ మధ్యే జరుగుతాయని ఖర్గే తెలిపారు. ఇండియావైపు నిలబడేవారు.. తప్పక విజయం సాధిస్తారని బెంగళూరులో రెండురోజుల చర్చలు 26 పార్టీల ముఖ్యనేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో విభేదాల్ని పక్కనబెట్టి ముందుకుసాగుతామని ప్రకటించిన నేతలు.. 2024 ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తామన్నారు.
ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా ఢిల్లీ, పంజాబ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బంగాల్, తమిళనాడు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నితీష్ కుమార్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. సోమవారం సమావేశంలో ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా సమాలోచనలు జరిపిన నేతలు.. మంగళవారం కూటమి పేరు ఖరారు చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. తక్షణమే కులాల ఆధారంగా జనగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.












Click it and Unblock the Notifications