అసహనంపై రగడ: మోడీని టార్గెట్ చేసిన రాహుల్
న్యూఢిల్లీ: అసహనంపై చర్చ సందర్భంగా మంగళవారంనాడు కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో తీవ్ర రగడ చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల మాట వినడం లేదని ఆయన అన్నారు. ప్రధానికి రాజ్యాంగంపై గౌరవం ఉందా అని ఆయన అడిగారు. బిజెపి కేంద్ర మంత్రులు భావప్రకటనా స్వేచ్ఛపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రభుత్వం తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దని, సహనంతో వ్యవహరించడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ మహాత్మా గాంధీని ప్రస్తావించారని, అంబేడ్కర్ను ప్రశంసించారని, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్ సేవల గురించి మాట్లాడారని, జవహర్ లాల్ నెహ్రూ గురించి కూడా రెండు మాటలు చెప్పారని, మోడీ ఉద్దేశంలో వారంతా మేధోపరమైన హీరోలని ఆయన అన్నారు.
కానీ ప్రజలు నిజమైన రాజ్యాంగ నిర్మాతలని, వారి గురించి మోడీ మాట్లాడలేదని ఆయన అన్నారు. దబోల్కర్, పన్సార్జీ, కల్బుర్గీలను కిరాతకంగా హత్య చేస్తే మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. హేతువాదులను కిరాతకంగా హత్య చేశారని ఆయన గుర్తు చేశారు. అవార్డులను వెనక్కి ఇచ్చిన కళకారులను అవమానించారని ఆయన అన్నారు.

భారత్కు సేవలు అందిస్తున్న వైమానిక దళానికి చెందిన యువకుడు మొహ్మద్ సర్తాజ్ తండ్రి అక్లాఖ్ను ముస్లిం కావడం వల్లనే హత్య చేశారని, అయితే అక్లాక్ కుమారుడు సారా జహాసే అచ్చా అంటూ దేశభక్తిని చాటుకున్నాడని ఆయన అన్నారు. దాద్రి ఘటనపై మోడీ ఒక్క మాట కూడా మాట్లాలేదని ఆయన అన్నారు.
గుజరాత్ అభివృద్ధి చెందిందని అంటున్నారని, గుజరాత్లో ఏమైంది, 20 వేల మంది పటేళ్లపై దేశద్రోహం కేసులు పెట్టారని, ఇదేనా అభివృద్ధి అని ఆయన అడిగారు. మోడీపై విమర్శలు చేసిన అరుణ్ శౌరిని కూడా బిజెపి నాయకులు వదిలిపెట్టలేదని, సెరిబ్రల్ పార్సీతో బాధపడుతున్న ఆయన కుమారుడిని కూడా వదలలేదని రాహుల్ గాంధీ అన్నారు.
హర్యానాలో దళితల పిల్లలను తగులబెడితే, తగులబడిన పిల్లలను కేంద్ర మంత్రి ఒకరు కుక్కలని అన్నాడని, అయినా మోడీ ఏ విధమైన చర్యలు కూడా తీసుకోలేదని ఆయన అన్నారు. మహాత్మా గాంధీని మోడీ ప్రశంసించారని, గాడ్సేను దేశభక్తుడని ప్రశంసించిన సాక్షి మహరాజ్పై మోడీ చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. బిజెపి మతవిద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications