నేడే ఈడీ ముందుకు రాహుల్ - కాంగ్రెస్ ఆందోళనలు : ర్యాలీలో ముఖ్య నేతలు..!!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. జూన్ 2నే ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం భారత్లో లేనందున విచారణకు అందుబాటులో ఉండబోనని ఈడీకి సమాచారం అందించారు రాహుల్. షెడ్యూల్ ప్రకారం తనకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకు సమ్మతించిన ఈడీ.. జూన్ 13న దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలని మళ్లీ సమన్లు పంపింది.
రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరుకానున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ నేతలు కేంద్రం పైన ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ మండిపడ్డారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ప్రధాన నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇదే అంశం పైన అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. గోవాలో మధుయాష్కి గౌడ్, దిల్లీలో సచిన్ పైలట్ సహా పలువురు నాయకులను నిరసనలను చేపట్టాలని సూచించింది.
ఎంపీలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, ముఖ్య నేతలంతా ఏఐసీసీ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ చేయనున్నారు. పలు ప్రాంతాల్లో ఉన్న ఈడీ యూనిట్ కార్యాలయాల వద్ద నిరసనల చేపట్టనున్నారు. రాహుల్ తో పాటుగా సోనియాకు సైతం లేఖ రాసారు. విచారణకు మరో మూడు వారాల గడువు కావాలని కోరారు. దీనికి అంగీకరించిన ఈడీ.. జూన్ 23న హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆస్పత్రిలో చేరిన సోనియా చికిత్స పొందుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్ను ఈడీ ప్రశ్నించింది. కాగా, అటు ఈడీ ముందుకు రాహుల్ హాజరవుతున్న వేళ.. కాంగ్రెస్ నిరసనలకు పిలుపునివ్వటం .. ప్రముఖ నేతలంతా ఇందులో పాల్గొనాలని ఆదేశించటంతో రాష్ట్రపతి ఎన్నికల ముందు..రాజకీయంగా ఈ వ్యవహారం కీలకం కాబోతోంది.