మోడీ సంకీర్ణ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని, అంతేగాక, ఆ కూటమిలోని కొందరు నేతలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నేతలు కొందరు తమతో టచ్లో ఉన్నారని చెప్పిన రాహుల్.. అందుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. మోడీ నేతృత్వంలోని కూటమి మనుగడ కోసం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. అది బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చని చెప్పుకొచ్చారు రాహుల్.

మరోవైపు, ఎన్నికల సమయంలో మోడీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు రాహుల్. మీరు విద్వేషాన్ని వ్యాప్తి చేసి.. దాని ఫలితాలను పొంది ఉండొచ్చు. అయితే, ఈసారి ఆ ఆలోచనను ప్రజలు తిరస్కరించారు. ఎటువంటి వివక్ష లేని పరిస్థితులు ఉంటే.. విపక్ష ఇండియా కూటమి నిస్సందేహంగా మెజార్టీ దక్కించుకుని ఉండేదని రాహుల్ వ్యాఖ్యానించారు.
తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లో తాము పోరాడామని, అలాంటి సమయాల్లో ఏం చేయాలో ప్రజలకు ఖచ్చితంగా తెలుసని అన్నారు రాహుల్. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. అయితే, 2024లో మాత్రం బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎన్డీఏ కూటమి పక్షాల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, కాంగ్రెస్ పరిస్థితి గతం కంటే ఈ ఎన్నికల్లో మెరుగుపడింది. ఈసారి 99 స్థానాలు దక్కించుకుంది. ఇక, ఇండి కూటమికి 230కిపైగా సీట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications