అమేథీలో రాహుల్, ప్రియాంక: బిజెపి గెలుపుపై చర్చ
అమేథీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీలో బుధవారం పర్యటించారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి లోకసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతోపాటు దేశంలోనూ దాదాపు తుడిచి పెట్టుకుపోయింది.
ఈ పరిణామంపై రాహుల్ గాంధీ జిల్లా పార్టీ కార్యకర్తలతో గౌరిగంజ్లోని పార్టీ కార్యాలయంలో చర్చించారు.
భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడంపై పార్టీ కార్యకర్తలతో రాహుల్ గాంధీ చర్చించారు. ఓటమితో కుంగిపోకుండా ప్రజలకు అండగా నిలబడాలని రాహుల్ గాంధీ కార్యకర్తలకు సూచించారు.

అంతకుముందు ఓ గ్రామంలో ప్రమాదవశాత్తు 67 గుడిసెలు కాలిపోగా నిరాశ్రయులైన ప్రజలను పరామర్శించారు. వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. ఇందిరా అవాస్ యోజన కింద వారికి కొత్త ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
కాగా, రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గం నుంచే బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన స్మృతీ ఇరానీ నుంచి గట్టి పోటీనే ఎదుర్కొన్నారు. మే 16న వెలువడిన ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీకి తీవ్ర ఉత్కంఠను కలిగించాయి. 2009 ఎన్నికల్లో మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన రాహుల్ గాంధీ, ఈ ఎన్నికల్లో కేవలం లక్ష ఓట్ల మెజార్టీతోనే గట్టెక్కారు.












Click it and Unblock the Notifications