రాహుల్ అధ్యక్షుడైతే దేశంలో కాంగ్రెస్ లేనట్టే: సీఎం యోగి ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడైతే తాము కోరుకుంటున్న ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’(కాంగ్రెస్ లేని భారత్) మరింత సులభమవుతుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.
గోరఖ్పూర్: కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడైతే తాము కోరుకుంటున్న 'కాంగ్రెస్ ముక్త్ భారత్'(కాంగ్రెస్ లేని భారత్) మరింత సులభమవుతుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ పట్టాభిషేకానికి ఆ పార్టీ సన్నద్ధమవుతున్న వేళ గోరఖ్పూర్ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం యోగి ఇలా ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడవడం తమకే మంచిదన్నారు.
ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల తొలివిడత పోలింగ్ బుధవారం జరిగింది. గోరఖ్పూర్ పోలింగ్ స్టేషన్లో ముఖ్యమంత్రి యోగి తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీవి వారసత్వ రాజకీయాలని, సోనియా గాంధీ తర్వాత ఆ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీ చేపడతారని, అందులో కొత్తదనం ఏముందని ప్రశ్నించారు. మోడీ చెబుతోన్న కాంగ్రెస్ ముక్త్ భారత్ మరింత త్వరగా సాకారమవుతుందని అన్నారు.