రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విడుదల.. మరో 70 మంది నిరసనకారులు కూడా..!
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై దేశ రాజధాని దిల్లీలో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీనికి నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు ధర్నా సాగింది.
ఈ క్రమంలో పోలీసులు అక్కడకు చేరుకుని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా దాదాపు 70 మంది నిరసనకారులను అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
అయితే కొన్ని గంటలపాటు నేతలను నిర్బంధించిన పోలీసులు తాజాగా వారిని విడుదల చేశారు. ధర్నా స్థలం నుంచి రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియం తరలించిన పోలీసులు.. కొన్ని గంటల తర్వాత పంపించేశారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ను కూడా ఛత్రసాల్ స్టేడియం తీసుకెళ్లారు. అనంతరం విడుదల చేశారు. వీరితోపాటు అరెస్ట్ అయిన ఎంపీ ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఆ తర్వాత ఆమెను కూడా విడుదల చేశారు. ఇక ఈ నేతలతోపాటు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు ఛలో పార్లమెంట్ లో పాల్గొని అరెస్ట్ అయిన 70 మంది నిరసనకారులకు కూడా విముక్తి లభించింది. ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తన సోదరుడు రాహుల్ గాంధీ ధీశాలి అని ప్రశంసించారు. ధైర్యవంతుడు దేన్నైనా తట్టుకుంటాడని అన్నారు. విద్యార్థులే దేశానికి భవిష్యత్తు.. వారి ఆందోళనల్లో న్యాయం ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications