రైల్వేలో విప్లవాత్మక మార్పు: ఇక అర్ధరాత్రి దాకా కార్యాలయాలు: రెండు షిఫ్టులుగా విభజన
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా చోటు చేసుకున్న శాఖల కేటాయింపు ప్రభావం.. అప్పుడే కనిపించడం ఆరంభమైంది. రైల్వే మంత్రిత్వ శాఖకు కొత్త మంత్రిని కేటాయించిన రెండోరోజే- విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటిదాకా- ఏ శాఖలోనూ మనం చూడని పరిణామం అది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రయాణికులతో ముడిపడి ఉన్న శాఖ కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చింది. ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే వాటిని కార్యరూపంలోకి వస్తుందంటూ రైల్వే శాఖ ప్రకటించింది.
అర్ధరాత్రి వరకూ అందుబాటులో..
ఆ మార్పు- రైల్వే కార్యాలయాల్లో రెండు షిఫ్టులు. ఇక దేశవ్యాప్తంగా రైల్వే శాఖ కార్యాలయాన్నీ రెండు షిఫ్టుల్లో పని చేస్తాయి. ఉద్యోగుల పని వేళలను రైల్వే మంత్రిత్వ శాఖ రెండుగా విభజించింది. తొలి షిఫ్టు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. మలి షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. అంటే- దేశంలోని అన్ని రైల్వే కార్యాలయాన్నీ ఉదయం 7 గంటలకే తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయి. ఉద్యోగులందరూ 7 గంటలకే కార్యాలయాలకు చేరుకుంటారు. అర్ధరాత్రి 12 గంటల వరకు విధి నిర్వహణలో ఉంటారు.
రైల్వే మంత్రిత్వ శాఖ కూడా..
ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రజా వ్యవహారాలు) డీజే నారాయణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాలయం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. దేశ రాజధానిలోని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు అందుబాటులోనే ఉంటుంది. రైల్వేశాఖకు కొత్త మంత్రిని కేటాయించిన రెండోరోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమౌతోంది.
రిటైర్డ్ ఐఎఎస్కు పనితీరు..
ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలంటే.. నిద్రను కొంత త్యాగం చేయాల్సి ఉంటుందని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. కొత్తగా చోటు చేసుకున్న మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రైల్వేశాఖకు కొత్త ముఖం అశ్వినీ వైష్ణవ్కు కేటాయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి. పెన్సిల్వేనియా యూనివర్శిటీ వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఐఐటీ-కాన్పూర్లో ఎంటెక్ చదివారు. రైల్వేతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కూడా ఆయన ఆధీనంలో ఉంది. విస్తరణకు ముందు రైల్వేకు ప్రాతినిథ్యాన్ని వహించిన పియూష్ గోయెల్ను వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, టెక్స్టైల్స్కు పరిమితం చేశారు.
గాడిన పెట్టడానికే..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పట్టాలు తప్పిన రైల్వేను గాడిన పెట్టడానికి శ్రమించాల్సి ఉంటుందనే విషయాన్ని ఆ శాఖ చెప్పకనే చెప్పినట్టయింది. ఏడాదిన్నర కాలంగా రైళ్లు పూర్తిస్థాయిలో నడవట్లేదు. ప్యాసింజర్లు రైళ్లు దాదాపు కనుమరుగయ్యాయి. ప్రయాణికుల సంఖ్య, రద్దీని దృష్టిలో ఉంచుకుని- ప్యాసింజర్ రైళ్లల్లో కోవిడ్ ప్రొటోకాల్ను విజయవంతంగా అమలు చేయడం సాధ్యం కాదనే కారణంతో వాటిని పక్కన పెట్టేసింది రైల్వేశాఖ. రైల్వేశాఖకు పూర్వ వైభవాన్ని కల్పించడంలో భాగంగా ఉద్యోగుల పని వేళలను రెండుగా విభజించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.