రైల్వే ప్రయాణ చార్జీల మోత: 14 శాతం పెంపు
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల చార్జీలు పెరిగాయి. ప్రయాణికుల చార్జీలు 14.2 శాతం పెరిగాయి. కాగా, సరుకు రవాణా చార్జీలు మాత్రం 6.5 శాతం పెరిగాయి. వచ్చే నెల రెండో వారంలో మంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ చార్జీలు పెరిగాయి.
పెరిగిన చార్జీలు శుక్రవారం నుంచే అమలులోకి వచ్చాయి. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గత యుపిఎ ప్రభుత్వం ఫిబ్రవరిలో మధ్యంతర రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో ప్రయాణికుల చార్జీలను పెంచలేదు.
ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీలు పెరుగుతాయనే సంకేతాన్ని మంత్రి సదానంద గౌడ మంగళవారంనాడే ఇచ్చారు. చార్జీల విషయంపై తాను ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుతానని, చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ప్లాన్ సపోర్టు కింద రైల్వే కేంద్రం నుంచి మధ్యంతర బడ్జెట్లో 29 వేల కోట్ల రూపాయలు పొందింది. బడ్జెట్ కోసం ప్రస్తుతం చార్జీలు పెంచినట్లు అర్థమవుతోంది.