రైలు ప్రయాణికులకు అద్దిరిపోయే శుభవార్త: ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కెదెప్పుడంటే..ముహూర్తం ఇదే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత.. రైళ్ల రాకపోకలపై దాని ప్రభావం తీవ్రంగా కనిపించింది. ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన రైళ్లు పట్టాలెక్కడానికి సుదీర్ఘ సమయం పట్టింది. అన్లాక్ ఆరంభమైన తరువాత గానీ.. రైళ్లు అందుబాటులోకి రాలేకపోయాయి. రైళ్ల రాకపోకలు పునఃప్రారంభమైన తొలిరోజుల్లో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అధికారులు అనుమతి ఇఛ్చారు. క్రమంగా ఆ సంఖ్యను పెంచారు. దాదాపు 70 శాతం వరకు రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అవన్నీ ఎక్స్ప్రెస్లే కావడం సామాన్య, దిగువ మధ్య తరగతి కుటుంబీకులకు నిరాశను మిగిల్చింది.
Recommended Video
గ్రామీణ ప్రజల దినచర్యల్లో భాగంగా..
దేశవ్యాప్తంగా లక్షలాది మంది గ్రామీణ ప్రజలు ఆధారపడేది ప్యాసింజర్ రైళ్ల మీదే. చిరు వ్యాపారులకు ఈ ప్యాసింజర్ రైళ్లే పెద్ద దిక్కు. రోజూ 20 నుంచి 30 కిలోమీటర్ల మేర దూరంలో వారు రాకపోకలు సాగిస్తుంటారు. తమ గ్రామం నుంచి పట్టణాలకు వెళ్లి..వ్యాపారాలను ముగించుకుని మళ్లీ ప్యాసింజర్ రైళ్ల ద్వారానే సొంత ఊర్లకు చేరుతుంటారు. ప్యాసింజర్ రైళ్లనేవి గ్రామీణ ప్రజల జన జీవనంలో ఓ ముఖ్య భాగం అయ్యాయి. చిరు వ్యాపారులు, రైతులు, విద్యార్థులు, కార్మికులు.. ఇలా దాదాపు అన్ని వర్గాలకు చెందిన ప్రజల దినచర్యలతో ప్యాసింజర్ రైళ్లు పెనవేసుకున్నాయి.
కరోనా పుణ్యంతో..
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అంటూ సుదీర్ఘకాలం నుంచి ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కట్లేదు. అన్లాక్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. ప్యాసింజర్లను మాత్రం పునరుద్ధరించడానికి ఇష్టపడలేదు. దీనికి కారణం- కరోనా వైరస్సే. పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంత ప్రజలు ప్యాసింజర్ రైళ్లల్లో రాకపోకలు సాగిస్తుండటం, ఆ రైళ్లకు హాల్ట్ వసతి కల్పించిన చిన్న చిన్న స్టేషన్లలో కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తారనే కారణంతో.. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు వాటి జోలికి వెళ్లలేదు.
ఎల్లుండి నుంచి
తాజాగా- ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మొత్తంగా 71 ప్యాసింజర్ రైళ్లను పట్టాలెక్కించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. పునఃప్రారంభించబోయే రైళ్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఇక దశలవారీగా అన్ని ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
కరోనా విజృంభిస్తోన్న వేళ..
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు 80 వేలకు పైమాటే. వరుసగా రెండోరోజు కూడా 80 వేలకు పైగా కొత్త కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. గత ఏడాది లాక్డౌన్ సమయంలో వెలుగులోకి వచ్చిన కేసులకు ఏ మాత్రం తీసిపోని వాతావరణం ప్రస్తుతం దేశంలో నెలకొంది. ఈ పరిణామాల మధ్య ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకుని వస్తామని రైల్వేశాఖ ప్రకటించడం చర్చనీయాంశమౌతోంది.