రాజకీయాల కంటే కుటుంబ భారమే కష్టం, అందుకే: స్మృతి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎదగడం కన్నా కుటుంబాన్ని వృద్ధి చేయడమే చాలా కష్టమైన పని అన్నారు. మహిళలు రాజకీయాల్లో నిలబడటం కష్టమేమీ కాదని, రాజకీయాల్లో ఎదగడం కంటే కుటుంబ భారం మోయడమే అత్యంత కష్టమన్నారు.
శనివారం నాడు మహిళా ఆర్థిక ఫోరం సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాల్లో ప్రవేశించడం అన్నది చెడ్డపని కాదని, కష్టమైన పని అంతకన్నా కాదన్నారు. వాస్తవం చెప్పాలంటే రాజకీయాల్లో ఎదగడం కన్నా కూడా పిల్లల్ని పెంచడమే కష్టమన్నారు.
రాజకీయాలు కష్టమని, మహిళలకు సరైనవి కావని అంటూ జరిగే ప్రచారంపై ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలను నిరోధించాలనే ఉద్దేశంతోనే ఈ తరహా ప్రచారం చేయటం, ప్రకటనలు గుప్పించడం వంటివి జరుగుతుంటాయన్నారు.
అయితే, అటువంటి ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరినీ ఆదర్శంగా తీసుకోనని చెప్పారు. తనను ఆదర్శంగా తీసుకుంటున్నామని చాలామంది పురుషులు చెప్పడం విన్నానన్నారు. అనాదిగా రాజకీయాల గురించి, మహిళల గురించి పేరుకు పోయిన అపోహలు చాలా ఉన్నాయన్నారు.
సామాజిక, కార్పోరేట్ రంగాల్లో అనుభవం ఉన్నవ మారికి ఇవి ఇంకా అనుకూలమైనవని చెప్పారు. వాస్తవానికి కార్పోరేట్ రంగాల్లో హద్దులు తొలగించి ఉన్నత స్థానానికి చేరడం కష్టమన్నారు. బయట ప్రచారంలో ఉన్నంతగా రాజకీయాలు అత్యంత చెడ్డవి, కష్టమైనవి కావన్నారు.