వారసుడిని ప్రకటించిన రాజా సింగ్- సంచలన స్టేట్ మెంట్
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజా సింగ్కు మరోసారి బెదిరింపులు అందాయి. ఆదివారం సాయంత్రం ఆయన నివాసానికి ఓ బెదిరింపు లేఖ అందింది. ఇలాంటి అనేక లేఖలు, బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భాలు గతంలోనూ అనేకం చోటు చేసుకున్నాయి. ఈ సారి మాత్రం దీని తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. రాజా సింగ్ కుమారుడిని కూడా బెదిరించారు. ఈ ఉదంతంపై రాజా సింగ్ నిప్పులు చెరిగారు. దీన్ని పోలీసుల వైఫల్యంగా తేల్చి చెప్పారు. కనీస దర్యాప్తు చేయట్లేదని మండిపడ్డారు.
ప్రాణాపాయం ఉందని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా తన ఇంటి అడ్రస్ కే బెదరింపు లేఖలు రాశారని, ఇప్పటికైనా దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీస్ డైరెక్టర్ జనరల్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండట్లేదని అన్నారు. ఇప్పటివరకు పోలీసులు ఏ ఒక్కరినీ కూడా పట్టుకోలేదని రాజా సింగ్ వాపోయారు.

పోలీసులు తనను పిలిచి, ఫిర్యాదును ధృవీకరించి, ఆధార్ కార్డు తీసుకుని వదిలేశారని ఈ తాజా లేఖలో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఈ బెదిరింపు లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడని రాజా సింగ్ తెలిపారు. పోలీసులు తనను ఏమీ చేయలేరని ఆ వ్యక్తి ఈ లేఖలో పేర్కొన్నాడని అన్నారు. నేరుగా తన కుమారుడిని కూడా బెదిరించడం అత్యంత దురదృష్టకరమని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారారని విమర్శించారు.
ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి, ఏ పోస్టాఫీస్ నుండి వస్తున్నాయో డీజీపీ, కమిషనర్, ముఖ్యమంత్రి గుర్తించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, వెంటనే విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని అన్నారు. అలాంటి బెదిరింపులకు తాము గానీ, తమ కుటుంబం గానీ భయపడబోమని రాజా సింగ్ ధైర్యంగా స్పష్టం చేశారు.
తన తర్వాత తన కుమారుడు ధర్మకార్యాలు చేస్తారని, ఆయనను రాజకీయాల కోసం కాకుండా హిందూ ధర్మ పరిరక్షణ పనుల కోసం సిద్ధం చేశామని రాజా సింగ్ తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత శంభాజీ మహారాజ్ ధర్మరక్షణ చేసినట్లే తన తర్వాత తన కుమారుడు కూడా అదే మార్గంలోనే నడుస్తారని ఆయన ఉద్ఘాటించారు. తమ కుటుంబమంతా ధర్మమార్గంలోనే నడుస్తుందని, ఇలాంటి బెదిరింపులకు తాము లొంగబోమని అన్నారు.












Click it and Unblock the Notifications