పైలట్ లేకుండానే 15 కి.మీ పరిగెత్తిన రాజధాని ఎక్స్ ప్రెస్..
న్యూఢిల్లీ : రైలు ఇంజన్ లో తలెత్తిన లోపంతో రంగంలోకి దిగిన సిబ్బంది సమస్యను పరిష్కరిస్తుండగానే రైలు దానంతట అదే 15 కి.మీ ప్రయాణించింది. రత్నగిరి సమీపంలోని ఓ సొరంగం వద్ద మజ్ గావ్-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఇంజన్ లో సాంకేతిక సమస్య తలెత్తగా.. సిబ్బంది దాన్ని పరిష్కరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సోమవారం నాడు సాయంత్రం గం.5.50 నిమిషాలకు రైలు రత్నగిరి రైల్వే స్టేషన్ కి చేరుతుందనగా ఇంజిన్ లో సమస్య తలెత్తింది. దీంతో రైలును అక్కడే నిలిపేసిన లోకో పైలట్ టెక్నీషియన్లకు సమాచారమిచ్చాడు. లోకో పైలట్ సమాచారంతో అక్కడికి చేరుకున్న టెక్నీషియన్లు లోపాన్ని సవరించే పనిలో ఉండగా.. పైలట్ గార్డు క్యాబిన్ లోకి వెళ్లాడు.
ఇంతలో రైలు దానంతట అదే ముందుకు కదలడం మొదలైంది. రైలు నిలిచిపోయిన సొరంగం మార్గం నుంచి పట్టాలు దిగువగా ఉండడంతో దాదాపుగా 15 కి.మీ మేర రైలు పైలట్ లేకుండానే నడిచినట్టు తెలుస్తోంది. కాగా వెంటనే అప్రమత్తతో వ్యవహరించిన లోకో పైలట్ గార్డు క్యాబిన్ నుంచి ఇంజన్ లోకి దూకి రైలును అదుపు చేయడంలో సఫలం చేశాడు.

అయితే రైలు ఇంజన్ కి సంబంధించిన బ్రేక్స్ ఫెయిల్ అవడం, అలాగే పట్టాలు దిగువ మార్గంగా ఉండడంతో రైలు దానంతట అదే ముందుకు కదిలినట్టు సమాచారం. పైలట్ రైలును అదుపులోకి తీసుకురాగానే సమీపంలోని చిప్లన్ స్టేషన్ లో రైలును నిలిపినట్టు చెబుతున్నారు.
అయితే దీనిపై స్పందించిన కొంకణ్ రైల్వే ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. దీనిపై పూర్తి విచారణకు ఆదేశించామని త్వరలోనే అసలు విషయమేంటనేది తెలుస్తుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications