ఈడీ అధికారిని అరెస్టు చేసిన రాజస్తాన్ సర్కార్-దెబ్బకు దెబ్బ దీసిన గెహ్లాట్..!
రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ చర్యలు, ప్రతి చర్యలు పతాకస్ధాయికి చేరాయి. రాష్ట్రంలో ఈనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసేందుకు ఈడీ సాయంతో బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇవాళ మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా ఈడీ అధికారినే రాజస్తాన్ ఏసీబీ అరెస్టు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.
రాజస్తాన్ లో తాజాగా సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ ఇంటిపై ఈడీ దాడులు చేపట్టింది. విదేశీ మారక ద్రవ్యం కేసులో ఆయన్ను ఏకంగా 9 గంటల పాటు విచారించింది. దీనిపై అధికార కాంగ్రెస్ మండిపడింది. కేంద్రం ఎన్నికల వేళ దర్యాప్తు సంస్ధల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. అదే సమయంలో రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్ధ అయిన ఈడీ అధికారుల కదలికపై దృష్టిసారించింది.

ఇందులో భాగంగా మధ్యవర్తి ద్వారా రూ.15 లక్షలు లంచం అడిగిన ఆరోపణలపై రాజస్థాన్ అవినీతి నిరోధక విభాగం ఏసీబీ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారిని అదుపులోకి తీసుకుంది. అనంతరం సదరు అధికారిని అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు అయిన ఈడీ అధికారిని నావల్ కిషోర్ మీనాగా గుర్తించారు. రాజస్థాన్లోని పలు చోట్ల నిర్వహించిన దాడుల్లో ఈడీ అధికారి చిక్కినట్లు ఏసీబీ ప్రకటించింది.
ఈడీ అధికారి నావల్ కిషోర్ మీనాను రాజస్థాన్ ఏసీబీ ట్రాప్ చేసింది. ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లంచం తీసుకుంటూ దొరికినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల వేళ ఈడీ అధికారిని అరెస్టు చేయడం ద్వారా రాజస్తాన్ కాంగ్రెస్ సర్కార్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గట్టి సందేశం పంపినట్లయింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతోంది.












Click it and Unblock the Notifications