యువతి రేప్ ఎఫెక్ట్: ఉబెర్ క్యాబ్స్కు దేశంలో నో
న్యూఢిల్లీ: ఉబెర్ క్యాబ్ సర్వీసులను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రసంగించారు. ఇక నుండి అన్ని టాక్సీలకు జీపీఎస్ సిస్టం ఉండాలని ఆయన చెప్పారు.
కాగా, ఢిల్లీ ప్రభుత్వం ఉబెర్ క్యాబ్ సర్వీసులను నిషేధించిన విషయం తెలిసిందే. అలాగే ఉబెర్ క్యాబ్ సర్వీసెస్ ద్వంద్వప్రమాణాలు పాటిస్తోందని తేలింది. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ చేతిలో ఓ మహిళ అత్యాచారానికి గురైన సంఘటన సంచలనం సృష్టించింది.
నిబంధనలు పాటించకుండా ఉబెర్ క్యాబ్ సర్వీసులను నడిపిస్తోందని తేలింది. అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా టాక్సీ సర్వీసులు నడిపే ఉబెర్.. భారతదేశంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్ పైన చర్యలు తీసుకుంటామని రాజ్యసభలో రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.

మహిళా ఎగ్జిక్యూటివ్ పైన అత్యాచారం నేపథ్యంలో అంతర్జాతీయ క్యాబ్ బుకింగ్ సర్వీసు ఉబెర్ కార్యకలాపాలపై ఢిల్లీలో నిషేధం విధించారు. మహిళా ఎగ్జిక్యూటివ్ పైన అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఈ సంస్థకు చెందిన ఒక డ్రైవర్ను ఆదివారం మధురలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ దారుణాన్ని నిరసిస్తూ ఆందోళనలు ఉద్ధృతమవుతుండటంతో రాజధానిలో మహిళల భద్రతకు చేపట్టవలసిన చర్యలపై మరోసారి దృష్టి సారించిన ప్రభుత్వం ఉబెర్ పైన సోమవారం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేకాకుండా రాజధానిలో ఎటువంటి రవాణా సేవలు అందించకుండా ఉబెర్ను బ్లాక్లిస్టులో పెట్టినట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. మహిళా ఎగ్జిక్యూటివ్పై అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్న ఉబెర్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ గతంలోనూ ఒక అత్యాచార కేసులో ఏడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించినట్లు తేలడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications